(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. ఆస్పత్రిలోని చెట్లపై ఓ మతానికి చెందిన గుర్తులు దర్శనమిచ్చాయి. ఇది గమనంచిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే చెట్లపై ఉన్న గుర్తులను చెరిపేసింది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని ఆస్పత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. కొద్ది కాలంగా టిటిడిలో అన్యమత ప్రచారం జరుగుతోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజా ఘటన చర్చనీయాంశంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్ ఆస్పత్రిలోని ఆవరణలో ఉన్న చెట్లపై శిలువ గుర్తులు కలకలం రేపాయి. గురువారం తెల్లారేసరికి ఆస్పత్రి ప్రాంగణంలోని చెట్లపై శిలువ గుర్తులు కనిపించాయి. శిలువ చిహ్నాలను చూసిన రోగులు ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం స్విమ్ సిబ్బంది ఆ గుర్తులను తొలగించారు. గుర్తులున్న చెట్ల బెరడును చెక్కేశారు. ఎవరో కావాలని చెట్లకు శిలువ గుర్తులను వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. ఎవరైనా కావాలనే ఇలా చేశారా.. అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో సైలెంట్ గా అన్యమత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం తిరుమల బస్ టిక్కెట్ వెనుకాల జరుసలేం యాత్ర, హజ్ యాత్రకు సంబంధించిన యాడ్సు ముద్రించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం వివాదాస్పదంగా మారింది. తాజాగా మరోసారి అన్యమత ప్రచారానికి సంబంధించిన అంశం తెరపైకి రావడంతో బిజెపితో పాటు హిందూ మత సంస్థలన్నీ కూడా ఆందోళనకు దిగనున్నాయని తెలుస్తోంది.