న్యూయార్క్: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్న దాయాది పాకిస్థాన్ మరోసారి తన అసలు రూపాన్ని బయటపెట్టుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కు ఆర్థిక సాయం చేయాలంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అభ్యర్థించింది. నలుగురు సభ్యులున్న కుటుంబానికి హఫీజే ఆధారమని, వారి ఆహారం, దుస్తుల ఖర్చు మొత్తం అతనే చూసుకుంటాడని, సయీద్ కుటుంబానికి నెలవారి ఖర్చులను విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ భద్రతా మండలిని పాక్ కోరింది. ఈ మేరకు ఆగస్టు 15వ తేదీన లేఖను రాసింది. అయితే పాక్ అభ్యర్థనపై నిర్ణీత గడువులోగా సభ్యుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో మండలి అందుకు ఆమోదించినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అనంతరం భద్రతా మండలి ఆదేశాల మేరుకు హఫీజ్ సయీద్ బ్యాంకు ఖాతాలను పాకిస్థాన్ ప్రభుత్వం నిలిపివేసింది. దీనివల్ల తన కుటుంబం కనీస అవసరాలకు కూడా డబ్బులులేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని హఫీజ్ పాక్ ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాడు. నెలవారీ ఖర్చుల నిమిత్తం తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి తీసుకువెళ్లింది. నెలకు కనీసం రూ.1.5 లక్షల పాకిస్థాన్ రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై సభ్యదేశాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో నిధులు ఇచ్చేందుకు ఐక్యరాజ్య సమితి అంగీకరించింది.
2008 ముంబై పేలుళ్ల సూత్రధాని అయిన హఫీజ్ సయీద్ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా భద్రతామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. లాహోర్లోని యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 1974-99 అసిస్టెంట్ ప్రొఫెసర్గా హఫీజ్ పనిచేశాడు. 25ఏళ్లు పాటు అధ్యాపకుడిగా సేవలందించడంతో హఫీజ్ కి నెలకు రూ.45,700 పెన్షన్ కూడా వస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో సయీద్ ను జులై 17న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హఫీజ్ లాహోర్ జైల్లో ఉన్నాడు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు పాక్ కంటితుడుపు చర్యలు చేపడుతోంది.