సింధ్: పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్సులో మైనారిటీ హిందూ మతానికి చెందిన ఒక వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఆమెది ఆత్మహత్య అని అంటుంటే.. విద్యార్థిని కుటుంబ సభ్యులు మాత్రం ఆమెది హత్య అని చెబుతున్నారు. ఘోట్కీకి చెందిన నమ్రితా చందాని అనే వైద్య విద్యార్థిని మంగళవారం హాస్టల్ రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడింది. మెడకు తాడు బిగించి ఉండగా ఆమె మృతదేహం హాస్టల్ గదిలో కనిపించింది. గది లోపల నుంచి గొళ్లెం వేసి ఉండడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అయితే తన సోదరి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె సోదరుడు విశాల్ సుందర్ అన్నారు. నమ్రితాది ఆత్మహత్య కాదు హత్యేనని చెప్పారు. తన సోదరి మంచి స్టూడెంట్ అని, ఆమె ఆత్మహత్య చేసుకునే అంత పరికిది కాదన్నారు. కేసును అన్ని కోణాల్లో విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే పోలీసులు మాత్రం పోస్ట్ మార్టమ్ తర్వాతే నమిత్రా మరణానికి కారణం తెలుస్తుందని చెబుతున్నారు. ఇదిఇలా ఉంటే.. నమ్రితాకు బలవంతంగా మతమార్పిడి చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
https://www.facebook.com/ProgressiveSindhis/videos/1433434853476687/
గత కొంత కాలంగా పాకిస్థాన్ లో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల సింధ్ ప్రాంతంలో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి వారి మతాన్ని కూడా మార్చిన ఉదంతంలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ దేశ మైనారిటీలైన హిందువులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా పాకిస్థాన్లో మైనారిటీ మతానికి చెందిన ఒక యువతిపై దాడి జరిగింది. గురుద్వారా తంబు సాహిబ్ గ్రంథి(పూజారి)కు చెందిన 19 ఏళ్ల కుమార్తెను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి ఆమెను ఇస్లాం మతంలోకి మార్పించారు. అంతేకాదు ఓ ముస్లిం యువకుడితో పెళ్లి కూడా చేశారు. తమ కుమార్తెను రక్షించాలంటూ ఆమె తండ్రి ఒక వీడియో సందేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కోరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ యువతి తన తల్లిదండ్రుల వద్దకు చేరింది.
సింధ్ ప్రాంతంలో దాదాపు వెయ్యి మంది హిందూ మతానికి చెందిన 12 నుంచి 18 ఏళ్ల అమ్మాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడుతూ.. నిఖా కూడా చేస్తున్నారు. పాకిస్థాన్ లోని మానవ హక్కుల కమిషన్ లెక్కల ప్రకారం జనవరి 2004 నుంచి 2018 మే వరకూ 7,430 మత మార్పిడి కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని పలు నివేదికలు స్పష్టం చేశాయి.