ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజర్ ఆస్తులను ఫ్రీజ్ చేయాలని, అతడిపై ప్రయాణా నిషేధాన్ని విధించాలని పాకిస్థాన్ అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. అతడిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. మసూద్ అజర్ కు వ్యతిరేకంగా తీర్మానం 2368 (2017)ను పూర్తిగా అమలు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
జైషే మహ్మద్ అధినేత మీద విధించిన ఆంక్షలను అమలుచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ ప్రకటనలో ఉంది. మసూద్ అజర్ ఆయుధాల కొనుగోళ్లు, అమ్మకాలు చేయకూడదని కూడా ఉత్తర్వుల్లో ఉంది. అతడిని బ్లాక్ లిస్టులో పెట్టడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఏకగ్రీవంగా ప్రతిపాదించగా, చైనా ఇప్పటికి నాలుగుసార్లు అడ్డుకుంది. తమ విధానాన్ని మార్చుకోవాలని చైనా నిర్ణయించుకోవడంతో ఐక్యరాజ్య సమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇది భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం.
జమ్ము కశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అదిల్ దార్ అనే ఆత్మాహుతి దళ సభ్యుడు దాడి చేసి 40 మందిని హతమార్చిన కొద్ది రోజులకే అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టాయి. మసూద్ అజర్ మీద విధించిన ఆంక్షలను తక్షణం అమలుచేయడానికి పాకిస్థాన్ అన్ని చర్యలు తీసుకుంటుందని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.