(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత్- పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తాజా భారత్ తో తపాలా సేవల్ని పాకిస్థాన్ నిలిపివేసింది. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ తీవ్ర కసితో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుంచి పంజాబ్ కి పోస్టుల ద్వారా వచ్చే ఉత్తరాలు, పత్రికలు, మ్యాగ్జిన్ లను దాయాది దేశం నిలిపివేసింది. ఈ మేరకు పాకిస్థాన్ కస్టమ్స్ విభాగం భారత్ కు తెలిపింది. పాకిస్థాన్ నుంచి పోస్టులు, పత్రికలు రావనే సమాచారం తమకు గత ఆగస్టు 23న వచ్చిందని భారత్ పోస్టల్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అజయ్ కుమార్ రాయ్ ఇండియాన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు తెలిపారు.
పోస్టులు ద్వారా చేసే ఎగుమతి, దిగుమతిని పాక్ ఆపేసిందని చెప్పారు. ఇకపై పాకిస్థాన్ నుంచి ఉత్తరాలు, పత్రికలు భారత్ కు రావని, ఇక్కడి నుంచి పాక్ కు వెళ్లవని చెప్పారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 27 నుంచే అమల్లోకి వచ్చాయని, అప్పటి నుంచే ఇరు దేశాల మధ్య ఎలాంటి పోస్టల్ మార్పడి జరగలేదని చెప్పారు. అయితే ఇది పాకిస్థాన్ ఏకపక్ష నిర్ణయమని తెలిపారు. ఈ ఆదేశాలకు ముందు విమానాల ద్వారా మెయిల్స్ ఎగుమతి జరిగేవని వివరించారు.
పాకిస్థాన్ లో ‘పంజాబ్ దే రంగ్’ అనే పంజాబీ మ్యాగ్జిన్ ని గురుముఖి, షాముఖి లిపితో ప్రచురిస్తారు. గురుముఖి లిపితో వచ్చే ఈ మ్యాగ్జిన్ కు భారత్ లో చాలా మంది పాఠకులు ఉన్నారు. ఈ పంజాబీ పత్రిక పాకిస్థాన్ లోని లాహోర్ నుంచి భారత్ కు వచ్చేది. భారత్ లో ఉన్న పాఠకుల కోసం పంజాబ్ దే రంగ్ కి చెందిన 70 కాపీల మ్యాగ్జిన్ లను తాము పంపిస్తే వాటిని పాకిస్థాన్ తపాలా శాఖ తిరిగి వెనక్కి పంపించిందని ఆ మ్యాగ్జిన్ చీఫ్ ఎడిటర్ ఇహ్సాన్ హెచ్ నాదిమ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు తెలిపారు.
‘భారత్ తో పోస్టల్ మార్పిడిని నిలిపివేయబడిందని మాకు తపాలా శాఖ ద్వారా తెలిసింది. మేము 2010 నుంచి గురుముఖి లిపిలో మ్యాగ్జిన్ ను ప్రచురిస్తున్నాము. భారత్ లో ఉన్న మా పాఠకుల కోసం మ్యాగ్జిన్ ను పంపిస్తాము. మ్యాగ్జిన్ పాఠకులు ఎక్కువగా పంజాబ్ లో ఉన్నారు. గురునానక్ 550వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఇది జరగడం విచారకరం’ అని అన్నారు. ఈ మ్యాగ్జిన్ ని ఇంగ్లీష్, పంజాబీ భాషల్లో ఉంటుంది. భారత్, పాకిస్థాన్, యూకే, అమెరికా తదితర దేశాల్లో ఉన్న పంజాబీలు ఈ మ్యాగ్జిన్ ను చదువుతారు. గురుముఖి లిపితో 500 కాపీలను ప్రచురిస్తే.. అందులో 70 కాపీలను భారత్ కు పంపించారు. డిమాండ్ తక్కువ ఉన్న కారణంగా గతేడాది షాముఖి ప్రచురణను నిలిపివేశారు.