Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారం ఒక పట్టాన ఎవరికీ అర్ధం కాదు. రాజకీయాల్లో ఉన్న వారు తరచు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉండాలి. వాటిని వదిలి పెట్టకుండా పోరాటం చేస్తేనే ప్రజల్లో నాయకత్వంపై నమ్మకం కలుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తనకు తోచినప్పుడు బయటకు వస్తుంటారు. సరైన సమయంలో అందుబాటులో ఉండరు అనే భావన ఉంది. అదే పవన్ కు మైనస్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు ఇవ్వకుండా, విభజన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. రాష్ట్రంలో ఓట్లు, సీట్లు లేని బీజేపీతో స్నేహం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రధాన సమస్యలపైనా స్పందించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
Pawan Kalyan: ఉద్యోగుల సమస్యపై స్పందించని జనసేనాని
ఇటీవల వరకూ గుడివాడలో కొడాలి నాని క్యాసినో వ్యవహారం హాట్ టాపిక్ గా నడిచింది. కానీ ఆ సమయంలో జనసేన పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులు మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించలేదు. అది ప్రజా సమస్య కాదు, దానిపై స్పందించడం వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదని అనుకుని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చు. అయితే ఈ విషయం కాకుండా రాష్ట్రంలో రెండు ప్రధాన సమస్యలు హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. ఒకటి జిల్లాల విభజన కాగా, మరొకటి ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన. ఈ రెండు విషయాలపైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించలేదు. పీఆర్సీ సమస్యపై ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 6వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళుతున్నారు. వీరి ఆందోళనకు సంఘీభావం కూడా ప్రకటించలేదు.
జిల్లాల పునర్విభజనపైనా సందించలేదు కానీ
మరో పక్క జిల్లాల పునర్విభజన అంశంపై పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ ప్రాంతాలకు తీరని అన్యాయం జరిగిందని గగ్గొలు పెడుతున్నారు. ప్రజాభీష్టానిికి భిన్నంగా జిల్లా కేంద్రాల ఏర్పాట్లు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపైనా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. కానీ కేంద్ర బడ్జెట్ మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలు చోటుచేసుకోకపోవడం కొంత నిరాశకు కల్గించింది అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెట్ బీజేపి ప్రభుత్వం రూపకల్పన చేయడం ఆశావహ పరిణామంగా కితాబు ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలతో మన భారతదేశం పోటీపడే విధంగా ఒక గొప్ప దార్శనికతను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదని ప్రసంశల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను జనసేన అభినందిస్తోందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఓ పక్క తెలంగాణ సీఎం కేసిఆర్, ఇటు ఏపిలోని వైసీపీ పార్లమెంట్ సభ్యులు, టీడీపీ ఇతర రాజకీయ పక్షాలు రాష్ట్రాలకు మంచి చేసేలా కేంద్ర బడ్జెట్ లేదని విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ అభినందిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. దీంతో ఎంతైనా మిత్రపక్షం కదా అందుకే ఈ ప్రశంసల జల్లు అని వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.