అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నా చేస్తున్న రైతులను మంగళవారం పవన్ కలిశారు. ఎర్రబాలెంలో మహిళా రైతులతోపాటు దీక్షలో కూర్చుని మద్దతు ప్రకటించారు. మహిళలు తమ సమస్యలను పవన్కు వివరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అమరావతిలో అవకతవకలు జరిగితే దోషులను శిక్షించాలన్నారు. అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. కొందరు వ్యక్తులపై ఉన్న కోపాన్ని.. ప్రజలందరిపై చూపించడం సరికాదన్నారు. రాజధాని రైతులను జగన్ మోసం చేశారని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటున్నామని చెప్పి… ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని ఉండటం ఇష్టం లేదని జగన్ ఒక్కమాట చెప్పి ఉంటే.. రైతులు భూములు ఇచ్చేవారు కాదన్నారు. జగన్ ధర్మం తప్పారని.. ధర్మం తప్పిన వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఈ నేల క్షమించదని వ్యాఖ్యానించారు. వైసీపీ న్యాయం చేస్తుందని ఓట్లేసి గెలిపిస్తే.. వారికి ఇచ్చే కానుక ఇదేనా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అమరావతి రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. ఇప్పుడు తన ప్రయత్నమంతా ఓట్ల గురించి కాదని.. మార్పు గురించేనని పవన్ తెలిపారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లేయించుకునే వాడిని కాదని, భూమిని నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగొద్దన్నదే తన ఉద్దేశమని పవన్ చెప్పారు. హైకోర్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం సీమ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. అమరావతిని ఎడారి అనడం, ఆందోళనకారులను పెయిడ్ ఆర్టిస్టులనడంపై పవన్ మండిపడ్డారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ రాజధాని అని ఇప్పటికీ ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదన్నారు. జగన్ ను 13 జిల్లాల ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని… ఆయన మాత్రం తాను కొన్ని జిల్లాలకే సీఎం అనే విధంగా వ్యవహరిస్తున్నారని పవన్ విమర్శించారు. అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నామని గతంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. రాజధాని కంటే ముందు రైతులకు అండగా ఉంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు భూములిస్తే ప్రభుత్వం మోసం చేయడం బాధాకరని పవన్ పేర్కొన్నారు. విశాఖపట్నమే రాజధాని అని స్పష్టంగా ప్రకటిస్తే.. అప్పుడు జనసేన కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటం ఆపొద్దని సూచించారు. భూములిచ్చింది ప్రభుత్వానికి.. ప్రభుత్వం మోసం చేస్తే నిలదీసే హక్కు మీకు ఉందని పవన్ తెలిపారు. రాష్ట్రంలో స్థిరత్వం కోసం ప్రజలు 151 సీట్లు ఇస్తే అస్థిరత ఏర్పరుస్తున్నారు. 151 సీట్లు వచ్చినా.. వైసీపీ ప్రభుత్వం కూలిపోవచ్చని పవన్ హెచ్చరించారు.