అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ కాపలా కాస్తూ ఉండలేనని, ఎవరి మోచేతి నీళ్లూ తాగబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి గుర్తింపు పొందిన వారు, ఇప్పుడు తన పద్ధతి బాగాలేదంటూ విమర్శలు గుప్పించి వెళ్లిపోతున్నారని అన్నారు. అటువంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. పార్టీ అండగా ఎదగాలని భావించేవారికి తాను అర్థం కానని, అటువంటి వాళ్ల విమర్శలను పట్టించుకోబోనని చెప్పారు.
గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు తప్పుమీద తప్పు చేసిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్లు సైతం అదే పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేశారని ఆరోపిస్తూ, రేషన్ కార్డులు, ఇళ్లపట్టాలను ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు దగ్గర చేసిన సంక్షేమ పథకాలకు 70 శాతం నిధులను కేంద్రమే ఇస్తోందని చెప్పారు. అయితే, వాటిని మళ్లిస్తున్నారని, దీనిపై త్వరలోనే ప్రజల్లోకి వెళతానని చెప్పారు. తనపై ఆధారపడిన కుటుంబాలను పోషించేందుకే తిరిగి సినిమాలు చేయాలని నిర్ణయించానే తప్ప, సినిమాలంటే ఇష్టంతో కాదన్నారు. అడ్డదారుల్లో సంపాదించే డబ్బు తనకు అక్కర్లేదని పవన్ స్పష్టం చేశారు. వ్యక్తిగత లాభాన్ని చూసుకుని ఉండుంటే, జనసేన పార్టీ పెట్టుండే వాడిని కాదని, బీజేపీలో చేరివుంటే కోరుకున్న పదవులు లభించి వుండేవని, వాటిని అనుభవిస్తూ ఉండేవాడినని పవన్ వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత రైతులు ఓటేయకపోయినా వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.