(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కలిసి పని చేస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. గురువారం విజయవాడలో బిజెపి, జనసేన కీలక భేటీ జరిగింది. రాష్ట్రంలో మరో సారి కలిసి పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధమైన బిజెపి, జనసేన నేతలు 2024 వరకు కలిసి నడిచేందుకు అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
సమావేశం అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కలిసి పోరాడతామన్నారు. బిజెపితో కలిసి పని చేయడానికి పవన్ ముందుకు వచ్చారన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం బిజెపి, జనసేనతోనే సాధ్యమనీ, ఇరువురం కలిసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు. వైసిపి నియంతృత్వ వైఖరిపై, గతంలో టిడిపి చేసిన అవినీతిపై కలిసి పోరాడతామని కన్నా అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాల కోసం బిజెపితో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చామని చెప్పారు. ఏపికి బిజెపి అవసరం చాలా ఉందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం వల్ల ఏపికి లాభమన్నారు. జనసేన, బిజెపి భావజాలం ఒక్కటిగానే ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం బిజెపితో కలిసి ముందుకు వెళతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేస్తామని పవన్ తెలిపారు.రాష్ట్రంలో ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యం, అంతకు ముందు అవకతవకలు, అవినీతితో కూడిన పరిపాలనతో ప్రజలు విసిగిపోయారనీ, తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారనీ పవన్ అన్నారు. దాన్ని బిజెపి, జనసేన అందించబోతున్నదని అన్నారు.ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం త్వరలో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. ఈ కలయికకు అండగా నిలబడిన ప్రధాని మోది, అమిత్ షాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
బిజెపి రాష్ట్ర ఇన్చారి సునీల్ దియోధర్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో బిజెపి, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. తెర వెనుక గానీ, ముందుగానీ టిడిపి, వైసిపితో ఎలాంటి సంబంధాలు లేవనీ, పొత్తులు కూడా పెట్టుకోమనీ ఆయన తేల్చి చెప్పారు. కేవలం జనసేనతోనే తాము రాజకీయ సంబంధాలు నెరుపుతున్నామని స్పష్టం చేశారు.ఏడు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి జగన్ పాలనలో వైఫల్యం చెందారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుటుంబ పాలన, అవినీతి పాలన, కులపాలన అనే మూడు గ్రహణాలు పట్టి పీడిస్తున్నాయనీ, వాటిని అంతమొందించి, బంగారు ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తామనీ దియోధర్ ప్రకటించారు.
రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రోజు చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో జనసేనతో తప్ప ఏ ఇతర పార్టీలతోనూ బిజెపికి రాజకీయ సంబంధాలు లేవని జివిఎల్ స్పష్టం చేశారు. వచ్చే నాలుగున్నరేళ్ల పాటు ప్రజా సమస్యలపై పారాటం చేస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. బిజెపితో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపారు
సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.