అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆయన ఇక్కడ నుండి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా కేంద్రంలోని పెద్దలను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వివరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ప్రారంభించి భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. అనంతరం పవన్ దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కొద్ది కాలంగా యురేనియం తవ్వకాలు, రాజధాని రైతుల సమస్య, భవన నిర్మాణ కార్మికులు తదితర సమస్యలపై జనసేన ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంను ఎత్తివేస్తూ నిర్బంధ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడాన్ని జనసేన అధినేత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాతృభాషలో చదవుతానని ఒక విద్యార్థి ముందుకు వచ్చినా గ్రామంలో తెలుగు మీడియం తరగతి కొనసాగించాల్సిందేనని పవన్ డిమాండ్ చేస్తున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన సమయంలో పవన్..అవసరమైతే ప్రధాని మోది, అమిత్షాను కలుస్తానని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.