(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళుతున్నారు. బిజెపితో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీ పెద్దలతో సమావేశం కావడానికి పవన్ మరో సారి హస్తినకు పయనమవుతున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బిజెపి- జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. అమరావతి రాజధాని సమస్యతో పాటు వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ రకంగా ఉద్యమించాలనే దానిపై ఇరు పార్టీలు కలిసి కార్యాచరణ రూపొందించనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావులు ఢిల్లీలోనే ఉన్నారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీ సాక్షిగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించడంతో అమరావతి రైతులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. పవన్ కళ్యాణ్ను మంగళారం రాజధాని గ్రామాల రైతులు కలిసి కలుసుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం తాము భూములు ఇస్తే వైసిపి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని మహిళా రైతులు పవన్ కళ్యాణ్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాజధాని రైతుల ఆవేదన విన్న పవన్ వారికి అండగా ఉంటాననీ, కేంద్రంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి అమరావతిపై ఎలాంటి పోరాటం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.