(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
జనసేనకు ఈసీ ‘గాజు గ్లాసు’ ఎన్నికల గుర్తును కేటాయించడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగాను ఆయన ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా ఈ గాజు గ్లాసుతో చిన్నప్పటి నుంచి తనకెన్నో మధుర స్మృతులున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. మన దేశంలో ఈ గాజు గ్లాసు సామాన్యుడికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు.
ఇదిలావుండగా గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో గాజు గ్లాసుపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు వెల్లువెత్తాయి. చాలామంది ఫ్యాన్స్ గాజు గ్లాసును మిగతా పార్టీల సింబల్స్తో పోల్చుతూ కామెంట్లు పెట్టారు. గాజు గ్లాసును గుర్తించడం, దాన్ని ప్రచారంలో తేవడం చాలా సులువని జనసేన భావిస్తోంది. గాజు గ్లాసును సామాన్యుడి గుర్తుగా ప్రచారం చేయవచ్చునన్నది ఆ పార్టీ నేతలు ఆలోచన. మోదీ 2014కు ముందు చాయ్ పే చర్చాతో పాపులర్ అయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. చాలా చోట్ల చిన్న హోటళ్లలో గాజు గ్లాసులోనే టీ ఇవ్వడం పరిపాటి. అదే తమకు కలిసివస్తుందని జనసేన నాయకులు భావిస్తున్నారు.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గాజు గ్లాసు సింబల్ దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నేడు జనసేనకు సుదినమని ఆయన వ్యాఖ్యానించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.