(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పోలవరం ప్రాజెక్టులో ‘అవినీతి’ జరిగిందనే ఆరోపణలపై సీబీఐతో విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను ఫిర్యాదుగా పరిగణించి.. విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని, టెండర్ నామినేషన్ల పద్దతిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలవరంపై విచారణ జరపాలని కేంద్ర జలశక్తి శాఖను సూచించింది. పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్ను ఫిర్యాదుగా భావించాలని తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16వేల కోట్ల నుంచి రూ.50వేల కోట్లకు పెంచడం వెనుక పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని పుల్లారావు ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులే, వైసీపీ ప్రభుత్వంలో కూడా అక్కడే ఉండి పోలవరంపై అవినీతిని బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పుల్లారావు అనుమానం వ్యక్తం చేశారు. పోలవరంలో అవినీతిపై విచారణ జరిపించాలంటూ గతంలో తాము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ప్రధాని కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశామన్నారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులు కొంతమేర జరిగాయి. పోలవరం ముంపు బాధితులకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల పరిహారం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందంటూ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం పెంచింది. అయితే, అందులో భారీగా అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్షం వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో టీడీపీ సర్కార్ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై దృష్టి పెట్టింది. పోలవరం సహా అనేక కీలక ప్రాజెక్టుల పనులన్నీ జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత కాంట్రాక్టర్ను తప్పించి, కొత్తగా రివర్స్ టెండరింగ్ పేరుతో తక్కువ ధరకు కొటేషన్ ఇచ్చిన వారికి ప్రాజెక్టు అప్పగించారు. ఈ రకంగా సుమారు రూ.750 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగులుతుందని చెప్పారు. పోలవరంలో అవినీతి జరిగినందుకే తాము ఇలా రివర్స్ టెండరింగ్కు వెళ్లామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎంత అవినీతి జరిగింది? ఎక్కడెక్కడ జరిగిందనే వివరాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు.
గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని, వాటిపై విచారణ చేసిన తర్వాత మాత్రమే పనులు తిరిగి ప్రారంభిస్తామని వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఓ కమిటీని నియమించారు. పనుల్లో ఓ కంపెనీకి వేలకోట్ల రూపాయలు లబ్ధిచేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని.. కుడి, ఎడమ కాలువల అంచనాల పెంచారని.. ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా ఉందని కమిటీ అభిప్రాయపడింది. అంచనాల పెంపుతో కాంట్రాక్టర్లకు మేలు జరిగిందని.. నిబంధనలు సైతం ఉల్లంఘించారని తెలిపింది. ప్రాజెక్ట్ కు సంబంధించి కొన్ని ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లకు లాభం కలిగేలా చేశారని కమిటీ తేల్చింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం రూ. 2,500 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. దానిని సరిచేయడం కోసం రివర్స్ టెండరింగ్ ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ నుంచి ఎడమ కాలువకు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ పద్ధతి నిర్వహించారు. దాని ద్వారా రూ. 58 కోట్ల రూపాయాలు ఆదా చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.
ఇటీవల కీలకమైన హెడ్ వర్క్స్, పవర్ స్టేషన్ కు సంబంధించిన రూ. 4,987 కోట్ల విలువచేసే పనులకు టెండర్లు పిలువగా.. 12.6 శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు ‘మేఘా’ సంస్థ ముందుకొచ్చింది. ఈ పనుల కోసం రూ. 4,358.11 కోట్లు కోట్ చేస్తూ.. మేఘా సంస్థ బిడ్డింగ్ వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా అవుతుందని నీటిపారుదల శాఖ పేర్కొంది. అంతేకాదు, గతంలో 4.8 శాతం అధిక ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 154 కోట్ల అదనపు భారం పడిందని, ఇప్పుడు ఆ భారం కూడా తగ్గడంతో ప్రభుత్వానికి మొత్తం రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అధికారులు వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో శ్రీకారం చుట్టారు. నాటి నుంచి టెండర్ల వ్యవహారంలో పలు వివాదాలు తెరమీదకు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలకు కూడా చేరాయి. టెండర్లు ఖరారు కావడంలో జరిగిన జాప్యంతో పనులు ముందుకు సాగని పరిస్థితి కూడా కనిపించింది. చివరగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2013 పోలవరం హెడ్ వర్క్స్ నిర్మాణ పనులను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి అప్పగించారు. ఆ తర్వాత చంద్రబాబు హయంలో ట్రాన్స్ ట్రాయ్తో మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని టీడీపీ చెబుతోంది. ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ సూచన మేరకే కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టామని, ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించేందుకు ‘రిజర్వ్డ్ టెండరింగ్’ అమలు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా అన్నీ తట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని 70శాతం పూర్తి చేశామని, మిగిలిన 30శాతం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే పోలవరం నిష్ప్రయోజనంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిఇలా ఉంటే. తాజాగా, పోలవరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో కేంద్రం పోలవరం ప్రాజెక్టు మీద విచారణ జరపనుంది. పోలవరంలో ఎప్పుడేం జరిగిందనే వివరాలు బయటకు రానున్నాయి. ఈ అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.