అమరావతి:రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానులంటూ చేసిన ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, కిష్టాయపాలెం, వెంకటాయపాలెం,రాయపూడి, తుళ్లూరు, మందడంలో పెద్ద ఎత్తు రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు తెలిపారు. రైతులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. వెంకటాయపాలెంలో రాజధాని రైతులు రిలే దీక్షలకు దిగారు. వెలగపూడి ప్రధాన కూడలిలోనూ రైతులు పెద్ద ఎత్తు ఆందోళన చేపట్టారు. మూడు రాజధానుల ప్రకటనను జగన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, తమ పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ పూలింగ్లో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చామని రైతులు పేర్కొన్నారు.
పెనుమాకలోనూ రైతులు రోడ్డుపై భైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజధానిపై తన వైఖరి మార్చుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిపాలన ఒక దగ్గర నుండే సాగాలనీ, మూడు చోట్ల నుండి జరిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారనీ అన్నారు. మీ రాజకీయాల కోసం రైతుల జీవితాలతో ఆడుకోవద్దంటూ వేడుకున్నారు. రాజధానిని ఈ ప్రాంతం నుండి తరలించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రైతులు హెచ్చరించారు. రాజధాని తరలిస్తే ప్రభుత్వానికి తాము ఇచ్చిన భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని కానీ రాజధాని ఇక్కడే ఉండాలని రైతులు స్పష్టం చేశారు.
తుళ్లూరులో రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. రైతులు పురుగు మందు డబ్బాతో రోడ్డుపై భైటాయించి ఆందోళనకు దిగారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకూ రహదారులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ – అమరావతి మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద టిడిపి ఆధ్వర్యంలో నేతలు అందోళనకు దిగారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పడవచ్చంటూ అసెంబ్లీ సాక్షిగా సిఎం జగన్ నిన్న కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన రాజధాని అమరావతి ప్రాంత రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.