కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ప్రధాని మోదీ “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరుతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన ఆయన ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం అని పేర్కొన్నారు. ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేస్తారని తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.
సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు సాగాలి
కరోనాతో నాలుగు నెలలకు పైగా ప్రపంచం పోరాడుతోందని అన్నారు. ఈ వైరస్ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించిందని, ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. మరింత సంకల్పంతో పోరాడాల్సిన సమయమిదని అన్నారు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉందన్నారు. కరోనాకు ముందు, కరోనా తర్వాత అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్లో కూడా అనేక మంది అయిన వారిని కోల్పోయారని, ఒకే ఒక్క వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం ప్రాణం కోసం యుద్ధం చేస్తోందని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు, వినలేదు అని అన్నారు. కరోనాతో వచ్చిన సవాళ్లను మనం అధిగమించామని, అప్పుడు మన దగ్గర ఒక్క పీపీఈలు, ఎన్ -95 మాస్క్లు ఉత్పత్తి కాలేదని, ఇప్పుడు వాటిని లక్షల్లో తయారు చేస్తున్నామని చెప్పారు. రోజూ రెండు లక్షల పీపీఈ కిట్లు, రెండు లక్షల ఎన్ – 95మాస్కులను తయారు చేస్తున్నామని మోదీ అన్నారు.
ఆర్థిక ప్యాకేజీతో ఊతం
చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆర్థిక ప్యాకేజీతో ఆదుకోవడం జరుగుతోందని చెప్పారు. భారత ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి రూపాయీ ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుందని, 21వ శతాబ్దపు ఆకాంక్షలకు తగినట్టు ఈ ప్యాకేజీ రూపకల్పన, నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేస్తుందని స్పష్టం చేశారు.
18 నుండి 4.0 లాక్ డౌన్ నిబంధనలు
దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలోపేతం చేసేందుకు ఈ భారీ ఆర్థిక ప్యాకేజీ ఉపయోగపడుతుందని పేర్కొన్న మోడీ.. రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనల మేరకు లాక్డౌన్ 4.0కు సంబంధించిన సమాచారం మే 18 కంటే ముందే అందరికీ తెలియజేస్తామని చెప్పారు. మాస్కులు కట్టుకుందాం, రెండడుగుల దూరం పాటిద్దాం అని పిలుపు నిచ్చిన మోడీ.. లాక్డౌన్ 4.0 పూర్తి స్థాయి భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కొరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అమలు, సడలింపులు తదితర విషయాలపై మోడీ నిన్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్న విషయం తెలిసిందే.