(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను, ప్రభుత్వాలను వణికిస్తున్న సమస్యగ కోవిడ్ వైరస్. ఈ సమస్యను అధిగమించేందుకు వివిధ దేశాలు, రాష్ట్రాలలో పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు పలు సూచనలు చేశారు. సంకల్ప బలంతో సమిష్టిగా ఈ మహమ్మారిని కట్టడి చేయగలమని ఆయన స్పష్టం చేశారు. 22న జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపు నిచ్చారు. ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు బయటకు రావద్దని సూచించారు. ‘నాకు ఏమి కాలేదన్న భావనతో మార్కెట్ కు వెళ్లడం, రోడ్ల మీద తిరగడం మంచిది కాదు, సామజిక దూరం పాటించడం అవసరం’ అని పేర్కొన్నారు.
జనతా కర్ఫ్యూ ఎందుకు?
జనతా కర్ఫ్యూ ఎందుకు? పాటించడం వల్ల ఉపయోగం ఉంటుందా? అనే ప్రశ్నలకు ప్రయోజనకరమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. కొరోనా వేగంగా విస్తరిస్తున్న దేశాలలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాయి.
సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పేరు కొత్తగా ఉన్నప్పటికీ వ్యవహారం పాతదే. ప్రతీ ఒక్కరూ బహిరంగ స్థలాలకు, సామాజిక కార్యకలాపాలకు, ఇతరులకు దూరంగా ఉండడమే సోషల్ డిస్టెన్స్. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో దాని ఉపద్రవాన్ని తగ్గించడంలో కీలకం సోషల్ డిస్టెన్స్. ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్ చెయిన్ ను బ్రేక్ చేయగలం. ఒక్కసారి ఈ చెయిన్ ను బ్రేక్ చేస్తే ఇక దాన్ని అరికట్టడం సులభమే. కొత్తగా వ్యాధి బారిన పడేవారు తగ్గిపోతే ప్రభుత్వంపై, ప్రజలపై, ఆసుపత్రులపై కూడా ఒత్తిడి తగ్గిపోతుంది.
సోషల్ డిస్టెన్స్ సాధ్యమేనా?
సోషల్ డిస్టెన్స్ ను అమలు చేయడం అంత సులభమేం కాదు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందే. ప్రభుత్వమే దాన్ని అమలు చేయాలంటే మాత్రం పలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా అయినా ఆ కఠిన చర్యలను తీసుకోవడంలో ముందుకెళ్తూనే ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం కఠిన చర్యల అమలుకు శ్రీకారం చుట్టాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నో ప్రాంతాల్లో ప్రజలతో పాటు వివిధ వర్తక, వాణిజ్య సంఘాలు కూడా దీన్ని ఓ మహోద్యమంలా చేపడుతున్నాయి. కార్యకలాపాలు బంద్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దేశంలో ఇప్పటికే డజనుకు పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ లాంటివాటిని మూసివేశాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి. హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజా రవాణా నిలిపివేతకు చర్యలు తీసుకున్నది.
రోజు వారి కూలీలకు ఇబ్బందే
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పలువురి ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రోజు వారి కూలీ పై జీవనం సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. కాకపోతే ఆ చర్యలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల వారిని ఆదుకోవాలని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.