(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్టు దగ్గర బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఆడంబరమైన స్వాగతం పలికారు. అనేక దేశాలను జయించి సామ్రాజ్యపు ఎల్లలు విస్తరింపజేసి రోమ్ తిరిగి వచ్చిన జూలియస్ సీజర్ను చూసి ఆ నగర వాసులు ఎలాంటి ఉద్వేగ ఆనందాలకు గురయి ఉంటారో మోదీని చూసి బీజేపీ కార్యకర్తలు కూడా అంతటి ఉద్వేగ ఆనందాలనే ప్రదర్శిస్తున్నారు. ఆనాటి ‘విని విడి విసి’ కి కూడా లోపం లేదు. సీజర్ లాగా విజయ విఖ్యాతుడైన మోదీ తన వైపు నుంచి ఆ పని కూడా కానిచ్చారు. ఎయిర్ పోర్టు వెలుపల కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. వెళ్లింది అక్కడి న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు. వెళ్లటం వెళ్లటం హూస్టన్ నగరంలో ‘ హౌడీ మోదీ’ సభలో పాల్గొన్నారు. మోదీ దౌత్య యాంత్రంగం ఆ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూడా రప్పించగలిగింది. అదే పెద్ద దౌత్య విజయం. ఇక సభ ఆద్యంతం మోదీ మార్క్ హడావుడితో నిండిపోయింది. అక్కడ చేరిన 50 వేల మంది ప్రవాస భారతీయులు సభను బ్రహ్మండమైన స్థాయిలో జయప్రదం చేశారు. భారత ప్రధాని తర్వాత అమెరికాలో సాగించనున్న జైత్ర యాత్రకు ఈ సభ సరైన ప్రాతిపాదికను సిద్ధం చేసింది.
నరేంద్ర మోదీ ప్రచార వ్యూహాకర్తలు అమోఘంగా పని చేయగలరు. గత అయిదేళ్లలో ఈ విషయం అనేక సార్లు రుజువయింది.ఇంటర్నెట్ యుగంలో సమకూరిన సదుపాయాలను వారు అద్భుతమైన రీతిలో ఉపయోగించి తమ నాయకుడికి ప్రచారం సాధించి పెట్టగలరు. సందర్భానికి తగిన విధంగా సోషల్ మీడియా స్పందనకు ట్రెండ్ ను ఏర్పాటు చేయగలరు. ఎలక్ట్రానిక్ మీడియాకు ఊపిరి సలుపని రీతిలో మేత అందించగలరు. ఈ అందజేయడంలో ఎక్కడన్నా పొరపాటున లోటు జరిగితే తమ వంతుగా దానిని భర్తీ చేసేందుకు 24 గంటల న్యూస్ ఛానళ్లు ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటాయి. అమెరికాలో విమానాశ్రయం లోపల రెడ్ కార్పెట్ పై రాలిన గులాబీని మోదీ వంగి తీసిన దగ్గర నుంచి మళ్లీ ఢిల్లీ విమానాశ్రయం బయట సభలో ఆయన ప్రసంగం పూర్తి అయ్యే వరకూ న్యూస్ ఛానళ్లు ప్రధాన మంత్రి వారం రోజుల పర్యటనను అత్యంత భారీ ఈవెంట్ గా నిర్వహించాయి. ఈ కవరేజ్ లో జాతీయ వాద భక్తిప్రపత్తులు కనబడితే అది చూసే వారి దృష్టి లోపం కాదు.
అమెరికా పర్యటనలో నరేంద్ర మోదీ కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడి మద్దతు సాధించగలిగారు. ట్రంప్ అక్కడే ఉండగా హౌడీ మోదీ సభలో జంకు గొంకు లేకుండా కశ్మీర్ సమస్యను తన ప్రభుత్వం పరిష్కరించిన తీరును వివరించగలిగారు. ఇంకా సాధించాల్సింది ఉందని అన్యాపదేశంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి ప్రస్థావించ గలిగారు. ఆయన ప్రభుత్వంలో పని చేసే రక్షణ మంత్రి, హోం మంత్రి , సైనిక దళాల ప్రధానాధికారి పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే ఇక మిగిలింది అని ముందు నుంచీ బాహటంగా చెబుతూనే ఉన్నారు.
ప్రధాని మోదీ పాకిస్థాన్ గురించి నేరుగా ప్రస్థావించి ఎక్కువ మాట్లాడకపోయినప్పటికీ ఆయన అమెరికా పర్యటన సందర్భంగా పాకిస్థాన్ ఏమాత్రం తూగలేకపోయింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాదన వెలాతెలాపోయింది. టెర్రరిజం ఎగుమతి కేంద్రాలను పెంచి పోషిస్తున్న కారణంగా పాకిస్థాన్ ప్రపంచ దేశాల దృష్టిలో విశ్వసనీయత కోల్పోయిందన్న మాట నిజమే కానీ, ఈ సారి పాక్ ను ఏకాకి చేయడంలో భారత దౌత్య నీతిపాత్రను విస్మరించలేం. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడి మద్దతు పొండడం మోదీ సాధించిన అతి పెద్ద విజయంగా అక్కడి ప్రవాస భారతీయులు భావిస్తున్నారు. హౌడీ మోదీలో సభలో భారత ప్రధాని అనూచానంగా వస్తున్న దౌత్య సాంప్రదాయాలను పక్కన పెట్టి ట్రంప్ మళ్లీ గెలవాలని కూడా అన్నారు. ఇది ఆ సభలో ఉన్న ప్రవాస భారతీయుల్లో ఎంత మందికి రుచించిందో గానీ మితవాద జాతీయ వాదం ఎజెండాగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రయోజనాలకీ, అమెరికాలోని భారతీయుల ప్రయోజనాలకూ మధ్య చాలా వైరుధ్యం ఉంది. మోదీని బలపరిచే ప్రవాస భారతీయులకు ఇక్కడ ఇండియాలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానాలు నచ్చవచ్చుగాక. ఎందు కంటే ఆ విధానాల వల్ల నష్టపోయేది పొట్ట చేత బట్టుకుని సరిహద్దులు దాటిన పేద ముస్లింలు మాత్రమే(కొన్ని సందర్భాలలో అక్కడే పుట్టి, అక్కడే పెరిగిన దేశీముస్లింలు కూడా నష్టపోతారు. కాగితాలు చూపించి తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడం అందరికి సాధ్యం కాకపోవచ్చు). ఈ మొత్తం ప్రక్రియలో ఒక్క హిందూ కూడా నష్టపోడని సాక్షాత్తు దేశ హోం మంత్రి అధికారికంగా ప్రకటించారు. ఇదే విధానం అక్కడ అమెరికాలో ట్రంప్ అనుసరిస్తే అది అక్కడి ప్రవాసభారతీయుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పరిణమిస్తుంది. ఇలాంటి వైరుధ్యాల నేపథ్యంలో హౌడీ మోదీ సభలో ట్రంప్ పాల్గొనడాన్ని మోదీ సాధించిన ఘన విజయంగా అక్కడి భారతీయులు పరిగణిస్తున్నారు.
స్వదేశంలో భారతీయులకు ఈ వైరుధ్యాల పేచి లేదు. కశ్మీర్ సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరించిన తీరుకు ప్రధాని అమెరికా పర్యటనలో ప్రపంచదేశాల మద్దతు సాధించారని సగటు భారతీయుడు అనుకుంటున్నాడు. దేశ ప్రధానిగా ఆయన ఇంటా బయటా ఘన విజయం సాధించారని భావిస్తున్నాడు. దశాబ్దాల తరబడి రాచపుండులా మారిన కశ్మీర్ సమస్యను మోదీ సునాయాసంగా పరిష్కరించినందుకు పండగ చేసుకుంటున్నాడు.
కశ్మీర్ ‘నిజంగా’ దేశంలో కలిసిపోయినందుకు దేశమంతా సంబరాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఆ కశ్మీర్ లో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎలా ఉన్నారు ? ఎవరి గురించి అయితే దేశం సంబరాలు చేసుకుంటున్నదో వారు మాత్రం సంతోషంగా లేరు. వారు ఏడు వారాలుగా దిగ్బంధంలో ఉన్నారు. వారికి ఫోన్లు లేవు, ఇంటర్ నెట్ సౌకర్యం లేదు. కర్ఫ్యూ అధికారికంగా లేకపోయినా కశ్మీర్ లోయ అంతటా అలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి.
జీవిత కాలం భారత రాజ్యంగానికి కట్టుబడి పని చేసిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా వందల మంది రాజకీయ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, ఇతరులు గృహ నిర్భంధంలో, కారాగారాల్లో మగ్గుతున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి ఎవరూ వెళ్లడానికి వీలులేదు. భద్రతాదళాల పహారాలో రాత్రింబవళ్లు గడుస్తున్నాయి. కశ్మీర్ లో అంతా బావుందని మోదీ ప్రభుత్వం చెబుతోంది. అంతా బాగుంటే ఇంత నిర్బంధం ఎందుకు కొనసాగుతున్నదో మాత్రం ప్రభుత్వం వివరించడం లేదు. టెర్రరిజాన్ని సాకుగా చూపడం తప్ప ప్రభుత్వం దగ్గర మరో వాదన లేదు. కశ్మీర్ లో పరిస్థితిని రిపోర్టు చేయడంలో భారత మీడియా దారుణంగా విఫలం అయినప్పటికీ అక్కడి నుంచి సమాచారం సేకరించి బయటి ప్రపంచానికి విదేశీ మీడియా అందించగలుగుతున్నది. అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని విదేశీ మీడియా వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇంత వరకూ రక్తం చిందలేదన్న ప్రభుత్వ వాదన నిజం కాదనీ, నిరసనలు, ప్రదర్శనలు, రాళ్లు రువ్వడం, భద్రతాదళాల కాల్పులు ఆగలేదని ఆ వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి. కశ్మీర్ సమస్య గురించి దశాబ్దాలుగా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరు దీనికి బాధ్యులన్న దానిపై ఆరోణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి. సమస్య పరిష్కారం దిశగా భిన్న విధాల సూచనలు ఉన్నాయి. ఏది మంచి, ఏది చెడు, ఏది సబబు, ఏదీ బేసబబు, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఏది పరిష్కారం, ఏది సమస్యను జటిలం చేయడం… ఇలాంటి మీమాంసలన్నీ కాసేపు పక్కన పెడదాం. కశ్మీర్ మంచి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యకు మొదట సంతోషించాల్సింది కశ్మీరీలు కదా! అలాంటిది దేశం అంతా సంతోషంగా ఉండటం ఏమిటి, కశ్మీరీలు విచారంగా, కోపంగా ఉండటం ఏమిటి? అక్కడో ఏదో తేడాగా లేదూ!?
ఆలపాటి సురేశ్ కుమార్