తిరుపతి: దేశ ప్రధానిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేంద్రంలో ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెబుతూ, రాష్ట్రంలో కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు అందించారు.
తిరుపతి చేరుకున్న మోదీ రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బిజెపి కార్యకర్తల సమావేశానికి వెళ్లారు. అక్కడ ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి తర్వాత హిందీలోకి దిగారు. మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి ఆయన ప్రసంగాన్ని తెలుగులో అనువదించారు.
కొందరు ఇంకా ఎన్నికల ఫలితాల షాక్ నుంచి బయటపడలేదని పరోక్షంగా ఒక విసురు విసరడం తప్పించి ఆయన టిడిపి అధినేత చంద్రబాబు జోలికి వెళ్లలేదు. ఆంధ్రప్రదేశ్ విశిష్టమైన రాష్ట్రమనీ, ఇక్కడి ప్రజలు అభివృద్ధిగాములనీ పేర్కొంటూ, వచ్చే అయిదేళ్లలో దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళతామో అలాగే ఆంధ్రను ముందుకు తీసుకువెళతామని ప్రధాని అన్నారు. సత్యనిష్టను ప్రజలు ఆదరించారనీ, వారు మెచ్చే పాలనను అందిస్తామనీ ఆయన పేర్కొన్నారు.
ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచే పరిస్థితి లేకున్నా ఆంద్ర, తమిళనాడు బిజెపి కార్యకర్తలు చిత్తశుద్ధితో పని చేశారని మోదీ వ్యాఖ్యానించారు. రెండ రాష్ట్రాలలోనూ భవిష్యత్తులో విజయం మనదేననీ, ప్రజల మనసులు గెలిచి పార్టీని విజయం వైపు నడిపించాలనీ మోదీ పిలుపునిచ్చారు.
ఘనస్వాగతం
దేశ ప్రధానిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన నరేంద్ర మోదీకి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శ్రీలంక నుంచి నేరుగా తిరుపతి చేరుకున్న మోదికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.