(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
వైసిపికి చెందిన కొందరు ఎంపిలు కేంద్రంలోని బిజెపి నేతలతో సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న తరుణంలో గురువారం ప్రధాని మోది ఆ పార్టీ ఎంపి రఘురామకృష్ణం రాజును ఆప్యాయంగా పలకరించారు.
పార్లమెంట్ సెంట్రల్ హాలు వెలుపల చోటుచేసుకున్న ఈ సంఘటన రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
రఘురామకృష్ణంరాజుతో మోది కరచాలనం చేసి భుజం తట్టగా ఆయన శిరస్సు వంచి నమస్కరించారు. ఈ సందర్భంగా అంతా బాగుందా అంటూ రఘురామకృష్ణంరాజును ప్రధాని అడిగారు. ఆ సమయంలో రఘురామకృష్ణంరాజు పక్కనే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. విజయసాయిరెడ్డి లేకుండా కేంద్రంలో ఎవరినీ కలవద్దు, మాట్లాడవద్దు అని పార్లమెంట్ సమావేశాలకు ముందే వైసిపి ఎంపిలకు జగన్ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. రాఘురామకృష్ణంరాజు వెళ్లి కలవకపోయినా మోదినే పలకరించారని తెలుగు ఏంపిలు మాట్లాడుకుంటున్నారు. లోక్సభలో మాతృభాష అభివృద్ధి విషయంలో రఘురామకృష్ణంరాజు మాట్లాడినందుకు ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలు రాగానే ఆయన వెంటనే స్పందించారు. ‘తెలుగు కోసం నిలబడతా, తెలుగు కోసం మాట్లాడటా, ఎవరైనా నన్ను అడిగితే సమాధానం చెబుతా’ అని సూటిగా రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం జరిగి 24 గంటలు గడవకముందే మోది ఆయనను ‘రాజు గారు బాగున్నారా’ అని పలకరించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది. ఎంపిగా గెలిచిన తరువాత మొదటి పార్లమెంట్ సమావేశాల సమయంలో రఘురామకృష్ణంరాజు మోదిని కలిశారు. పాత పరిచయం కారణంగానే మోదిని తాను కలిసి అభినందనలు తెలియజేసినట్లు నాడు రఘు రామకృష్ణంరాజు వివరణ ఇచ్చుకున్నారు.