కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ వివరణ ప్రచురించారు. దానికి నేపధ్యం ఏమంటే ముందు రోజు పత్రికలో చంద్రయాన్ రిపోర్టింగ్ సంబంధించి ల్యాండర్ ఏమయిందన్న వార్తకు విక్రమ్ బోల్తా అన్న శీర్షిక పెట్టారు. విక్రమ్ తల్లకిందులుగా దిగిందన్న విషయం బోధపరిచేందుకు అలా బోల్తా అన్న పదం వాడాల్సివచ్చిందనీ, ఇస్రోను కానీ, చంద్రయాన్ను కానీ కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదనీ ఆంధ్రజ్యోతి సంపాదకుడు ఈ వివరణ ఇచ్చుకున్నారు. బోల్తా పద ప్రయోగానికి ఎంత తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తే పత్రిక వారు అలా వివరణ ఇచ్చుకున్నారో అర్ధం చేసుకోవడం కష్టం కాదు.
చంద్రయాన్ దేశప్రజలలో ఎలాంటి దేశభక్తిపూరిత భావోద్వేగాన్ని రగిలించిందో ఇది తెలియజేస్తున్నది. విక్రమ్ చంద్రగ్రహం ఉపరితలంపై దిగుతుందనగా దేశవ్యాప్తంగా ప్రజలు అర్ధరాత్రిపూట టివిలకు అతుక్కుపోయారు. ల్యాడింగ్ మిషన్ విఫలం అయిందన్న విషయం తేటతెల్లం అయిన తర్వాత ఇస్రో డైరక్టర్ కైలాసవడివు శివన్ ఉద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టినపుడు అక్కడే ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను హత్తుకుని వీపు తట్టడం సీనును పూర్తిగా పండించింది.
నాలుగు రోజుల తర్వాత మధ్యభారతంలోని జార్కండ్ రాష్ట్రం నుంచి ఒక వార్త వచ్చింది. గత జూన్లో మూకదాడికి బలయిపోయిన ముస్లిం యువకుడు తబ్రేజ్ అన్సారీ కేసులో నిందితులపై ఐపిసి 302 సెక్షన్ కింద హత్యాభియోగం కాకుండా, ఐపిసి 304 కింద శిక్షార్హమైన వధ (మహ)కు పాల్పడ్డారన్న అభియోగం మోపుతూ చార్జ్షీట్ దాఖలు చేస్తున్నారన్నది ఆ వార్త సారాశం. దీని నేపధ్యం ఏమంటే గత జూన్ 17వ తేదీన జార్ఖండ్, సరైకేలా ఖర్సవాన్ జిల్లాలోని ధక్తిది గ్రామంలో అటుగా వెళుతున్న తబ్రేజ్ అన్సారీ అనే 24 ఏళ్ల యువకుడిని మోటార్ సైకిల్ చోరీ చేస్తున్నాడన్న అనుమానంతో పట్టుకుని స్తంభానికి కట్టేసి 12 గంటల పాటు కొడుతూ హింసించారు. అతనితో జైశ్రీరాం, జైహనుమాన్ అనిపించారు.
ఫలానా చోట ఇలా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఆరు గంటల తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లారు. తజ్రేజ్ విడిపించి తీసుకెళ్లి మోటార్ సైకిల్ దొంగతనం ఆరోపణపై కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు అతనిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపింది. 12 గంటల పాటు దెబ్బలు తిని ఆసుపత్రికి వెళ్లాల్సిన తబ్రేజ్ జైలుకు వెళ్లాడు. అతని ఆరోగ్యం విషమించిన తర్వాత గానీ తబ్రేజ్ను ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచన పోలీసులకు రాలేదు. చావు దెబ్బలు తిన్న నాలుగు రోజుల తర్వాత తబ్రెజ్ అన్సారీ కన్నుమూశాడు.
ఈ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్టు చేశారు. వారి అరెస్టులను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఇప్పుడు వారిని హత్యాభియోగం కింద కాక హత్యానేరం కిందకు రాని శిక్షార్హమైన వధ సెక్షన్ కింద విచారిస్తారట. కారణం ఏమయ్యా అంటే తబ్రేజ్ అన్సారీ పోస్టుమార్టం నివేదికలో అతను గుండెపోటు కారణంగా మరణించినట్లు తేల్చారు.
తబ్రేజ్ అన్సారీని స్తంభానికి కట్టేసి కొడుతున్న వీడియో ఆ వెంటనే బయటకువచ్చింది. నేరస్థలం దగ్గరకు వెంటనే వెళ్లడంలో పోలీసులు ప్రదర్శించిన అలసత్వం, దెబ్బల కారణంగా తబ్రెజ్ తలకు అయిన గాయాన్ని గుర్తించడంలో ప్రభుత్వ వైద్యుల వైఫల్యం అతని మరణానికి దారి తీశాయని జార్ఖండ్ ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ తేల్చింది. దెబ్బల కారణంగా తలకు అయిన గాయం కలిగించిన వత్తిడి గుండెపోటుకు దారి తీసిందని రెండవ వైద్యుల నివేదికలో అభిప్రాయపడ్డారు.
తబ్రేజ్ అన్సారీ మూకదాడి కారణంగా మరణించాడన్న విషయంలో పిల్లలకు కూడ సందేహం ఉండదు. జార్ఖండ్ పోలీసులకు మాత్రం ఈ కేసు మరోలా కనబడింది. పోస్టుమార్టం నివేదిక మృతి కారణాన్ని ఏమని చెబుతున్నా చేతిలో ఉన్న అన్ని ఆధారాలతో పకడ్బందీగా హత్య కేసు పెట్టాలని వారికి అనిపించడం లేదు.
విక్రమ్ వైఫల్యానికీ, తబ్రెజ్ అన్సారీ కేసుకూ సంబంధం ఏమిటన్న సందేహం చదువరులకు ఈపాటికే వచ్చి ఉండాలి. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టడం అని తెలుగులో ఒక సామెత ఉంది. పరస్పరం ఏమాత్రం సంబంధం లేని రెండు అంశాలను ముడిపెట్టడంలోని అసంగతనూ, అనౌచిత్యాన్నీ ఎత్తిచూపేందుకు ఆ సామెత వాడతారు. కానీ కొన్నిసార్లు బోడుగుండుకూ, మోకాలికీ ముడిపెట్టాల్సి వస్తుంది. అలా పరస్పరం పొంతన లేని రెండు విషయాలను ముడిపెట్టడం ద్వారా సమాజంలోని వైరుధ్య చిత్రాన్ని స్థూలంగా ఆవిష్కరించవచ్చు.
ఒకపక్క భారత్ చంద్రుడిపై ల్యాండింగ్ కాగలిగిన దేశంగా గుర్తింపు కోసం సాగిస్తున్న వైజ్ఞానిక కృషి. మరోపక్క అత్యంత అనాగరికమైన పాశవిక మూకహత్యలు. నూతన వైజ్ఞానిక శిఖరాలు అధిరోహించగలిగిన దేశంగా భారతావనికి గుర్తింపు తెచ్చే ప్రభుత్వ నేతగా ప్రజల మదిలో చోటుకోసం మోదీ ప్రయత్నం. మైనారిటీ మతంలో పుట్టడమే నేరంగా దెబ్బలు తిని ప్రాణాలు విడిచిన వ్యక్తికి చావులో కూడా అన్యాయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాగం ప్రయత్నం.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ దేశ ప్రజలలో బలమైన సంకుచిత జాతీయవాదం చొప్పించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సైనిక చర్యల దగ్గర నుంచి చంద్రయాన్ వరకూ ప్రతి సందర్భాన్నీ అందుకు అవకాశంగా మలచుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు సహజంగానే మైనారిటీ వ్యతిరేక భావనలు బలపడడానికి దోహదపడుతున్నాయి. ఫలితంగా ఆ వర్గంపై దాడులు పెరిగాయి.
నేపధ్యం ఏమయినప్పటికీ ఇస్రో డైరక్టర్ శివన్ను ప్రధాని మోదీ ఓదార్చడాన్ని తప్పు పట్టాల్సిన పని లేదేమో కానీ, ఆయన అలా చేయకపోయినా దేశం కోల్పోయేదేమీ లేదు. 1980లో రోహిణి ఉపగ్రహాన్ని ఎస్ఎల్వి రాకెట్ మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టిన నాటి నుంచీ ఇస్రో విజయపరంపరలో కొన్ని వైఫల్యాలూ ఉన్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో వాటిని అధిగమించి మరిన్ని విజయాలు అందుకున్నారు. అందుకు వారికి ఏ నాయకుడి ఓదార్పూ అఖ్కర్లేకపోయింది.
దీనికి భిన్నంగా ఓదార్పు కావాల్సింది తబ్రెజ్ అన్సారీ భార్యకు. 19 ఏళ్ల వయస్సులో భర్తను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న శైష్టా పర్వీన్కు ఎంతైనా ఓదార్పు కావాలి. కనుచూపు మేరలో ఆశ కనబడని భయంకర సంక్షోభంలో చిక్కుకున్న ఆ యువతికి కాస్త ధైర్యం ఇచ్చే ఓదార్పు కావాలి. నరేంద్ర మోదీ ఓదార్చాల్సింది శివన్ను కాదు. జార్ఖండ్ వెళ్లి పర్వీన్ తల నిమరాలి. అమ్మా భయపడకు నీకు నేను న్యాయం చేస్తాను అని ధైర్యం ఇవ్వాలి.
నిజానికి ఆ ఓదార్పు కోరుకునేది పర్వీన్కు ధైర్యం చెప్పాలన్న ఉద్దేశ్యంతో మాత్రమే కాదు. ప్రధాని అంతటివాడు వెళ్లి మూకదాడి బాధితురాలిని పరామర్శిస్తే దేశంలో గోరక్షక దళాల పేరుతో స్వైరవిహారం చేస్తున్న మూకలకు గట్టి హెచ్చరిక అందుతుంది. సాటి మనిషిని చేతులతో కొట్టి చంపే పైశాచికతకు పురికొల్పగల నినాదంగా జైశ్రీరాంను వాడుకుంటున్న రాక్షస మూకలకు కాస్తన్నా భయం ఉంటుంది. తబ్రేజ్ అన్సారీ ఘటన విషాదమే కానీ, అందుకు జార్ఖండ్ రాష్ట్రాన్ని నిందించిండం ఎలా సబబు అని ప్రశ్నించి తన ప్రాధాన్యతలేమిటో స్పష్టం చేసిన ఈ దేశ ప్రధాని నుండి అలాంటి ఓదార్పు ఆశించగలమా?
ఆలపాటి సురేశ్ కుమార్