(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కాన్పూర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ గంగా నది వద్ద మెట్లు ఎక్కుతూ జారి పడ్డారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ కింద గంగా నది పరిశుభ్రతను పరిశీలించడానికి ప్రధాని అక్కడికి వెళ్లారు. అటల్ ఘాట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పవిత్ర గంగానదిలో విహరించారు. ఉత్తర్ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ మిత్రపక్ష నేతలు మోదీ వెంట ఉన్నారు. అనంతరం అటల్ ఘాట్ వద్ద మెట్లు ఎక్కుతూ ఒక అడుగు తప్పి మెట్లపై పడిపోయారు. అదృష్టవశాత్తు ఆయనకు గాయాలేం కాలేదు. వెంట ఉన్న సెక్యూరిటీ తక్షణమే ఆయన్ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత యథావిధిగా అన్ని కార్యక్రమాల్లోనూ మోదీ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/TheRoshanRai/status/1205801716291010560
మోదీ ప్రభుత్వం ‘నమామి గంగే’ ప్రాజెక్టు పేరిట గంగానది ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా గంగా కౌన్సిల్ సమావేశాన్ని కాన్పూర్ లో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గంగా నదిలో బోటుపై షికారు చేశారు. ప్రధాని మోదీతోపాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ గంగానదీలో పర్యటించారు. గంగానది పరివాహక ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పర్యటనకు గైర్హాజరయ్యారు. ‘నమామి గంగే’ పథకం సమీక్షా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఎంతవరకూ విజయవంతమైందనే విషయాన్ని ప్రత్యక్షంగా అంచనా వేశారు.