వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఆయన పోటీ పడుతున్నారు. ఆయన నామినేషన్ ప్రతిపాదకులలో అక్కడి మణికర్ణికా ఘాట్ వద్ద శవాలు కాల్చే డోమ్ రాజా కుటుంబ సభ్యుడొకరు, ఒక చౌకీదార్, మహిళా కళాశాల ప్రిన్సిపాల్, మరో సీనియర్ బీజేపీ నాయకుడు ఉండనున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, అన్నాడీఎంకే నేతలు, శిరోమణి అకాలీదళ్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్, ఎల్జేపీ నాయకుడు రాం విలాస్ పాశ్వాన్, కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు కూడా మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
2014లో ఇక్కడ పోటీ చేసినపుడు నరేంద్రమోదీ 3.37 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు 56%పైగా వచ్చాయి. ఈసారి కూడా ఆయనతో కాంగ్రెస్ పార్టీ నుంచి గత అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ పడుతున్నారు. సమాజ్ వాదీ పార్టీ తమ అభ్యర్థినిగా శాలినీ యాదవ్ ను ఎంపిక చేసింది. జగదీష్ చౌధురి ఒక ప్రతిపాదకుడు అవుతారని, సీనియర్ నాయకుడు సుభాష్ గుప్తా, ఓబీసీ వర్గానికి చెందిన ఒక చౌకీదారు కూడా ఆయనకు ప్రతిపాదకులు కావచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పాణిని కన్యా మహావిద్యాలయ ప్రిన్సిపాల్ నందితా శాస్త్రి చతుర్వేది కూడా ప్రధాని పేరును ప్రతిపాదిస్తారు. ఇది తనకు చాలా గర్వకారణమని, పెద్ద గౌరవమని ఆమె అన్నారు.
దివంగత షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ మనవడు నసీర్ అబ్బాస్ బిస్మిల్లా కూడా ప్రతిపాదించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన మోదీకి లేఖరాశారు గానీ, ఆయన పేరు ఇంకా ఖరారు కాలేదు. గత ఎన్నికలలో మోదీకి ప్రతిపాదకులుగా ఉండాలని కోరినా, ఆ కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించారు. అప్పట్లో మదన్ మోహన్ మాలవీయ మనవడు గిరిధర్ మాలవీయ, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఒకరు, పద్మవిభూషణ్ ఛానులాల్ మిశ్రా, పడవ నడుపుకొనే వీరభద్ర నిషాద్, చేనేత కార్మికుడు అశోక్ మౌర్య మోదీని ప్రతిపాదించారు.