గుజరాత్, మార్చి 4 : రఫేల్ యుద్ధ విమానాలు ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని తాను చేసిన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. ప్రతిపక్ష నేతలు కొంచెం కూడా బుర్ర లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మోది అసహనం వ్యక్తం చేశారు.
సోమవారం గుజరాత్లోని జామ్నగర్ లో మోది మాట్లాడుతూ… ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య జరిగిన గగనతల పోరాటంలో రఫేల్ యుద్ధ విమానాలు ఉండుంటే భారత వాయుసేనకు గొప్ప ఆధిక్యం దక్కేదని తాను వ్యాఖ్యానిస్తే… మన వాయుసేన సత్తాని ప్రధాని శంకిస్తున్నారంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మోది ఆగ్రహం వ్యక్తం చేశారు.
“దయచేసి కాస్త బుర్రను ఉపయోగించండి. భారత్, పాక్ యుద్ధ విమానాలు పరస్పరం దాడులకు దిగినప్పుడు రఫేల్ వంటి అత్యాధునిక జెట్ విమానం మన పక్షాన ఉంటే మన యుద్ధ విమానం ఒక్కటి కూడా కూలిపోయి ఉండేది కాదని అన్నాను. అదే సమయంలో ప్రత్యర్థుల విమానాల్లో ఒక్కటి కూడా తప్పించుకుని ఉండేది కాదు అని చెప్పాను” అంటూ మోది వివరించారు.
శనివారం ఇండియా టుడే గ్రూప్ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్-2019 ‘ కార్యక్రమంలో పాల్గొన్న మోది.. సమయానికి రఫేల్ జెట్లు లేవని దేశం బాధపడుతోందని, అవి ఉండి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని వ్యాఖ్యానించారు.
దీంతో రఫేల్ యుద్ధ విమానాల రాక ఆలస్యానికి ప్రధాని మోదీయే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
‘‘ప్రధాని గారూ.. మీకు ఏ కోశానా సిగ్గు లేదా? మీరు 30వేల కోట్లు దొంగిలించి మీ స్నేహితుడు అనిల్కు ఇచ్చారు. రఫేల్ జెట్లు భారత్కు చేరడంలో ఆలస్యానికి కేవలం మీరే కారణం. మీ వల్లే వింగ్ కమాండర్ అభినందన్ వంటి ధైర్యవంతులైన పైలట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాలం చెల్లిన విమానాలు నడుపుతున్నారు’’ అని మోదీని రాహుల్ విమర్శించారు.
మోది ఈ విషయంపై ఆదివారం మరోసారి స్పందిస్తూ.. భారత గగనతలంలో త్వరలోనే రఫేల్ యుద్ధ విమానాలు ఎగురుతాయని, గత కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్లుగా ఈ ఒప్పందంపైనే చర్చలు జరిపిందని, కానీ ఫలితం రాలేదని విమర్శించారు. ఈ ఒప్పందం వల్ల తమకు లాభం చేకూరకుండా పోవడంతోనే కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.