న్యూస్ ఆర్బిట్ డెస్క్
మహారాష్ట్రలోని వార్ధాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. కేరళలోని వాయనాడ్లో రాహుల్ గాంధీని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిందువులను అవమానించిందని ఆయన అన్నారు. ఇది కోడ్ ఉల్లంఘన కాదని ఈసీ చెప్పింది. ప్రధాని మోదీపై అనేక ఫిర్యాదులు నమోదు కాగా వాటిపై ఈసీ స్పందించిన తొలి సందర్భం ఇదే. ఏప్రిల్ ఒకటో తేదీన.. సరిగ్గా నెల రోజుల క్రితం వార్ధాలో ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ప్రజలున్న నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారని, అందుకే వాళ్లు మెజారిటీలు మైనారిటీలుగా ఉన్న ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్తున్నారని మోదీ అన్నారు. ఆయన వ్యాఖ్యలు హేయమైనవి, విభజనకారకమైనవని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
మహారాష్ట్రలోని వార్ధాలో ప్రధాని చేసిన ప్రసంగం ఎన్నికల కోడ్కు అనుగుణంగానే ఉంది తప్ప ఎక్కడా దాన్ని ఉల్లంఘించినట్లు కనిపించలేదని ఈసీ తెలిపింది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలపై నమోదైన ఫిర్యాదుల విషయంలో క్రియారహితంగా ఉన్నారంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసు ఇచ్చింది. వారిద్దరూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ, సైనిక దళాలను రాజకీయ ప్రచారంలోకి తెస్తున్నారని ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేసును గురువారానికి వాయిదా వేసింది. ఫిర్యాదులు నమోదై మూడువారాలు దాటినా ఈసీ స్పందించలేదని కాంగ్రెస్ వాదించింది. ఇప్పటికే ఈసీ వద్ద పలువురు నాయకులపై కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులున్నాయి. వారిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి మేనకాగాంధీ, మాయావతి, కాంగ్రెస్ నేత నవ్జోత్ సింగ్ సిద్ధూ తదితరులున్నారు. సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్పై రెండుసార్లు ప్రచార నిషేధ ఆదేశాలు జారీ అయ్యాయి.