అమరావతి: ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులకు పోలీసు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 149 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులు పంపించారు. జైల్ భరో, గుంటూరు కలెక్టరేట్ ముట్టడి అంటూ పత్రికల్లో వచ్చిన ప్రకటనల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుతోపాటు పలువురు రాజధాని ప్రాంతంలో ఉంటున్న టీడీపీ నేతలకు నోటీసులు అందాయి. ఆందోళనల కారణంగా రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగే ప్రమాదముందని పోలీసులు తెలిపారు. గొడవలు జరిగితే ప్రాణనష్టానికి దారి తీయవచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరసనలు చేపట్టాలని రాజధాని ప్రాంత గ్రామస్థులకు పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా రాజధాని రైతులు నిరసనలు చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జనవరి 20 న అమరావతి జెఎసి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. చలో అసెంబ్లీకి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించాలని రైతులు, మహిళలను కోరారు. టీడీపీ ఇప్పటికే దీనికి జై కొట్టింది. జనసేన, బీజేపీ పార్టీలు తమ మద్దతు తెలియజేయాలని నిర్ణయించాయి. మూడు రాజధానులపై హై పవర్ కమిటీ సిఫారసులపై చర్చించడానికి జనవరి 20 న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం కానుంది.
మరోవైపు హైపవర్ కమిటీ శుక్రవారం(జనవరి 17) సీఎం జగన్తో సమావేశమైన సంగతి తెలిసిందే. సోమవారం(జనవరి 20) జరగనున్న కేబినెట్ సమావేశంలో రాజధానిపై ఏపీ క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20న అసెంబ్లీ సమావేశాలకు ముందు చలో అసెంబ్లీ పిలుపుతో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళన కారులెవ్వరూ కనిపించకూడదని ఆంక్షలు విధించారు. అంతేకాదు అక్కడ 144 సెక్షన్ విధించారు. అందులో భాగంగానే రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చలో అసెంబ్లీ ఉంటుందా ? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.