(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) కార్యాలయ నిర్వహణకు ఫంక్షన్ హాలు అద్దెకు ఇచ్చిన యజమానికి ప్రభుత్వం నుండి తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. టిడిపి అధినేత చంద్రబాబు ధర్నా చేస్తే ఆ ప్రభావం ఫంక్షన్ హాల్ మీద పడింది.
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక ఫంక్షన్ హాలును అమరావతి పరిరక్షణ సమితి నేతలు తమ కార్యక్రమాల నిర్వహణకు అద్దెకు తీసుకున్నారు. నిన్న సాయంత్రం టిడిపి అధినేత చంద్రబాబు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ హాలు నుండి జెఎసి ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభించాలని భావించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టిడిపి అదినేత చంద్రబాబుతో సహా పార్టీల నేతలు, జెఎసి నాయకులు అక్కడే ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తరలించిన విషయం తెలిసిందే.
ఈ పర్యవసానాల నేపథ్యంలో గురువారం ఫంక్షన్ హాలుకు పోలీసులు నోటీసు జారీ చేశారు. వివిధ వేడుకలకు అద్దెకు ఇవ్వాల్సిన ఫంక్షన్ హాలును నిబంధనలకు విరుద్దంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించే అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులకు ఇవ్వడంపై పోలీసులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ మేరకు పడమట పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పేరుతో వేదిక ఫంక్షన్ హాలు యజమాని చెన్నుపాటి వజీర్కు నోటీసు జారీ చేశారు. విజయవాడ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలో ఎలాంటి సమ్మెలు, ర్యాలీలు, ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగూడటాలు నిషేదంలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా ఫంక్షన్ హాలును దీక్షకు, నిరసన కార్యక్రమాలు చేసే వారికి ఇచ్చినందున ఫంక్షన్ హాలు అనుమతులు రద్దు చేసే దిశగా చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేయనున్నట్లు హెచ్చరించారు.