అమరావతి: పల్నాడు ప్రాంతమైన గురజాలలో బిజెపి బహిరంగ సభకు బయలుదేరిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం నందిగాం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు కన్నా వాహనాన్ని నిలుపుదల చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున బహిరంగ సభ నిర్వహించడానికి వీలులేదని పోలీసులు తెలుపుతున్నారు.
నేడు గురజాలలో బహిరంగ సభ నిర్వహించాలని బిజెపి నాయకులు నిర్ణయించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం పల్నాడులో నెలకొన్న రాజకీయ పరిణామాలు, శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. గురజాల సిఐ రామారావు సోమవారం ఉదయం గుంటూరులో కన్నా నివాసానికి వచ్చి తమ ప్రాంతంలో 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున గురజాలకు బయలుదేరి వెళ్లవద్దని కోరుతూ నోటీసు అందించారు. అయితే కన్నా నోటీసు తీసుకునేందుకు నిరాకరించడంతో కన్నా ఇంటి గోడకు నోటీసు అంటించారు.
బహిరంగ సభను రద్దు చేసుకునే ప్రశ్నలేదని తేల్చి చెప్పిన కన్నా ఆ వెంటనే గురజాలకు బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గుంటూరు నుండి గురజాల వరకూ రహదారులను దిగ్బంధం చేశారు. ఫిరంగిపురం, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నరసరావుపేట మార్గాల్లో ఆయన ఎటు నుండి గురజాలకు వెళ్లాలని ప్రయత్నించినా అడ్డుకునేందుకు పోలీసు తనిఖీలు ఏర్పాటు చేశారు. నందిగాం క్రాస్ రోడ్డు వద్ద కన్నా ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించి నిలుపుదల చేశారు. డీఎస్పి విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కన్నాను అదుపులోకి తీసుుకొని సత్తెనపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
గురజాలకు వెళ్లకుండా పోలీసులు నిలువరించడంపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో జరుగుతున్న అరాచకపాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్దంగా ధర్నా చేపడితే పోలీసులు గొంతు నొక్కే ప్రయత్నం చేసి అక్రమ అరస్టులు చేస్తున్నారని కన్నా విమర్శించారు. వైసిపి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన అజెండాగా పని చేస్త్దుందంటూ కన్నా ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా ?
పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడితే పోలీసులు గొంతునొక్కే ప్రయత్నం చేసి అక్రమ అరెస్ట్లు చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిని వెనక్కి పరిగెత్తించి, కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన అజెండా. pic.twitter.com/fLatC9v8vS— Kanna Lakshmi Narayana (@klnbjp) September 16, 2019