(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. ఎస్ఈసీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ప్రచారంతో దూకుడుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చతికిలపడిన పార్టీలు ఈసారి తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి పార్టీ కూడా ఒంటరిగా బరిలో దిగింది. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. పోటీ చేయాలా ?లేదా? ఎన్నికలకు దూరంగా ఉండి పరువు కాపాడుకుందామా? అన్న ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐతో జట్టుకట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిపోరుకే మొగ్గుచూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి మూడు ఎంపీ సీట్లు గెలిచింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒంటరి పోరాటం వైపే మొగ్గు చూపింది. అయితే, తెలంగాణ టీడీపీ మాత్రం మరోసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆపార్టీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రాథమిక చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీతో పొత్తుకు విముఖత చూపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ శత్రువు అయిన టీడీపీతో పొత్తు వల్లే అధికారం రాలేదని కాంగ్రెస్ లోని చాలా మంది నాయకులు బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా బరిలో దిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా ఒంటరిగానే బరిలో ఉంది. హుజూర్ నగర్ ఉపఎన్నిక సందర్భంగా సీపీఐ మద్దతు కోరినప్పటికీ ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ మద్దతును ఉపసంహరించుకుంది. అయినప్పటికీ హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. తెలంగాణలో తమకు ఎదురే లేదని అంటున్న గులాబీ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లోనూ విపక్షాలు చుక్కలు చూపించాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశాల్లో మంత్రులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓడితే… ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రుల పదవులు పోవడం ఖాయమని కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఢోకా లేదని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని వారికి సీఎం కేసీఆర్ చెప్పారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయన్నారు.
మరోవైపు టీజేఎస్, సీపీఐ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బీఎల్ఫ్ పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ మూడు పార్టీల్లో ఒక్కో పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. సీపీఎం ఖమ్మం, నల్గొండలో కూడా ప్రభావం కోల్పోయింది. హుజూర్నగర్ ఎన్నికల ఫలితంతో ఇది స్పష్టమైంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. పార్టీ పరంగా రెండు కమిటీలను ఏర్పాటు చేశామని, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే, సీపీఐ, సీపీఎం పార్టీలు మున్సిపల్ బరిలో ఉంటాయా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది.
బీజేపీ సైతం పొత్తులకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో ఎటువంటి పొత్తుల్లేకుండా బరిలో నిలిచిన బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో అనూహ్య విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పొత్తుల కంటే ఒంటరిగా బరిలో దిగితేనే లాభం ఉంటుందనే అభిప్రాయం ప్రధాన పార్టీల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ఒంటరి పోరుకే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ పార్టీలను పట్టణ ప్రజానీకం ఎంతమేర ఆదరిస్తారో వేచి చూడాలి.