(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా ? అనే సందిగ్దానికి తెరపడింది. రేపోమాపో ఎన్నికల నిర్వహణకు ప్రకటన రానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. నోటిఫికేషన్కు ముందే వార్డుల్లో తిరుగుతూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై నాలుగు నెలలుగా ప్రతిష్టంభనకు తెరపడింది. దాదాపు 73 మున్సిపాల్టీలపై గతంలో విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తేసిన హైకోర్టు.. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. వార్డుల పునర్విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన, ఓటరు జాబితాల రూపకల్పన తదితర అంశాలపై జూలై 7న ఇచ్చిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దుచేసింది. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పట్టు బిగిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్ ఎన్నికలపై ఆయా పార్టీల నేతలు సమీక్షలు జరుపుతున్నారు. పోటీచేసే వారి జాబితాను కూడా తయారు చేస్తున్నట్లు సమాచారం.
ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తరుణంలో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హుజూర్నగర్ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో టీఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపాలిటీలపై గులాబీజెండా ఎగరవేసి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నది. పట్టణాల్లో పార్టీ కమిటీల నియామకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడంపై కసరత్తు చేస్తోంది. స్థానిక సమస్యలపై నేతలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించిన బీజేపీ.. మున్సిపల్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలను రాబట్టాలని ప్రత్నిస్తోంది. వామపక్షాలతో పాటు టీడీపీ ఇతర పార్టీల నేతలు కొన్నిస్థానాల్లోనైనా పోటీచేసేందుకు ఏర్పాటును చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.