(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణలోని ప్రధాన పార్టీలన్ని హుజూర్నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చేనెల అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ లో ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ ఎంపీగానూ విజయం సాధించడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్నగర్ కు ఉప ఎన్నిక అనివార్యమయింది. సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని ఉప ఎన్నికల బరిలోకి దింపుతామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా హుజూర్ నగర్పై దృష్టి పెట్టింది. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును సిఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ శనివారం మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని సిఎం నిర్ణయించారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకేననీ గులాబీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటామనీ, కాంగ్రెస్ నేతలంతా కలిసి వచ్చినా టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య గట్టి పోరు తప్పదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అక్టోబర్ 21న హుజూర్నగర్ ఉప ఎన్నిక , అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? హుజూర్నగర్ లో కారు దూసుకెళ్తుందా? తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.