ప్రధాని చాపర్ తనిఖీ చేసిన మొహిసిన్
తప్పేమీ కాదన్న క్యాట్.. ఈసీ స్పందన
న్యూఢిల్లీ: ఒడిశా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారపై విధించిన సస్పెన్షన్ ను ఎన్నికల కమిషన్ ఎత్తేసింది. రెండువారాల్లోగా ఇరుపక్షాల నుంచి సమాధానాలు ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశించి, సస్పెన్షన్ ను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ చర్య తీసుకుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) రక్షణలో ఉన్నవారితో ఎలా వ్యవహరించాలన్న సూచనల మేరకు నడుచుకోలేదని ఇంతకుముందు ఎన్నికల కమిషన్ మహ్మద్ మొహిసిన్ ను సస్పెండ్ చేసింది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఎన్నికల సమయంలో తనిఖీలకు ఎలాంటి మినహాయింపులు ఉండవని అన్నాయి.
సస్పెన్షన్ మీద కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) స్టే విధించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) రక్షణలో ఉన్నవారు ఏమైనా, ఎలాగైనా చేయచ్చన్న నిబంధన ఏమీ లేదని, ఎన్నికల అధికారులు ఇంతకుముందు కర్ణాటక సీఎం కుమారస్వామి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వాహనాలను కూడా తనిఖీ చేశారని గుర్తుచేసింది. సదరు అధికారి దూరం నుంచి ప్రధాని హెలికాప్టర్ ను వీడియో రికార్డు చేయాలని ఆదేశించగా, దానిపై ప్రధాని భద్రతా సిబ్బంది ఫిర్యాదుచేశారని తెలిపింది. కర్ణాటకలో ఒక ర్యాలీ సందర్భంగా నల్ల ట్రంకుపెట్టెను దూరంగా తీసుకెళ్లారని, దానిపైనా ప్రశ్నలు తలెత్తినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పింది.
ట్రిబ్యునల్ నుంచి ఈ ఉత్తర్వులు వచ్చిన కొద్దిసేపటికే ఐఏఎస్ అధికారిపై విధించిన సస్పెన్షన్ ను ఎన్నికల కమిషన్ ఎత్తేసింది. ఆయనను తిరిగి కర్ణాటక ప్రభుత్వానికి రిపోర్టుచేయాలని తెలిపింది. అయితే, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఈసీ సూచించింది. ఒడిశాలోని సంభల్ పుర్ నియోజకవర్గానికి సాధారణ పరిశీలకుడిగా మహ్మద్ మొహిసిన్ నియమితులయ్యారు. ఆయన 1996 బ్యాచ్ కర్ణాటక కేడర్ అధికారి. ప్రధాని చాపర్ ను ఆయన ఉన్నట్టుండి తనిఖీ చేయడంతో మోదీ ప్రయాణం 15 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో ఎన్నికల కమిషన్ మొహిసిన్ ను ఏప్రిల్ 17న సస్పెండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేశాయి.