న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని లాతూరులో ఎన్నికల ప్రసంగం సందర్భంగా కోడ్ ఉల్లంఘించినట్లు ప్రధాని నరేంద్రమోదీపై ఓఫిర్యాదు వచ్చింది. కానీ అది ఇప్పుడు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లోంచి మాయమైపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ నాయకులపై మొత్తం 426 ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటన్నింటి జాబితా ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో ఉంది. కానీ, ఏప్రిల్ 9న మోదీపై నమోదైన ఫిర్యాదు ఒక్కటి మాత్రం అందులో లేదు. కోల్ కతాకు చెందిన మహేందర్ సింగ్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. పుల్వామా అమరులకు, బాలాకోట్ ఉగ్రదాడులు చేసిన సైనికులకు ఓట్లను అంకితం చేయాలని ప్రధాని ఆ ర్యాలీలో కోరినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల తర్వాత మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ప్రసంగం రాతప్రతితోపాటు వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. కానీ ఫిర్యాదు పరిస్థితిపై మాత్రం అనుమానాలున్నాయి.
తాను లాగిన్ అయినప్పుడు ఫిర్యాదు స్టేటస్ లో పరిష్కారం అయినట్లే ఉందని మహేందర్ సింగ్ చెప్పారు. కానీ అందులో పరిష్కారం అయినట్లుగా కాకుండా, వివరాలను ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర సీఈవో ద్వారా సంబంధిత అధికారి వివరణను గురువారం మధ్యాహ్నం 1 గంటలోగా ఇవ్వాలని కోరినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. స్టేటస్ ఇలా తప్పుగా చూపించడానికి సాంకేతిక లోపమే కారణమని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఫిర్యాదు ఇంకా తెరిచే ఉందని, మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుంచి వివరణ పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. కానీ, రెండు వారాలు గడిచినా ఇంతవరకు ప్రధాని మోదీపై ఎన్నికల సంఘం తగిన చర్య ఏమీ తీసుకోలేదు. ఈలోపు మోదీ మాత్రం పుల్వామా, బాలాకోట్ అంశాలను చాలాసార్లు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రధాని ఇలా తరచు బాలాకోట్ వైమానిక దాడులను తన ర్యాలీలో ప్రస్తావించి, జాతీయ భద్రతను బీజేపీయే కాపాడుతుందన్నట్లు చెప్పడంపై త్వరలోనే ఈసీ స్పందిస్తుందని అంటున్నారు.