ఫ్లాయిడ్ మార్టిన్ తో జిమ్ పెట్రోవ్ స్కీ, షార్లట్ కుటుంబం
35 ఏళ్ల పాటు అమెరికాలో సేవలు
మరువలేని బహుమతులిచ్చిన స్థానికులు
ఆయన హవాయి ప్రయాణానికీ ఏర్పాట్లు
ప్రజల గుండెల్లో నిలిచిన ఫ్లాయిడ్ మార్టిన్
అట్లాంటా: జార్జియాలోని మారియెటా ప్రాంతంలో సుదీర్ఘ కాలం పాటు పోస్టుమ్యాన్ గా సేవలందించిన ఫ్లాయిడ్ మార్టిన్ రెండు రోజుల క్రితం రిటైరయ్యారు. సాదారణంగా అయితే ఒక షేక్ హ్యాండ్ ఇవ్వడమో, మహా అయితే ఆయన కోసం కేకు తేవడమో చేస్తారు. కానీ, అట్లాంటా శివార్లలోని ఆ చిన్న పల్లెలో మార్టిన్ అంటే ప్రేమాభిమానాలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో మార్టిన్ రిటైర్మెంటు ట్రెండ్ అవడంతో దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆ ప్రాంతానికి ఆయనతో ఉన్న అనుబంధాన్ని శ్లాఘిస్తున్నారు. మారియెట్టా ప్రాంతంలోని వారంతా ఆయన కోసం తమ మెయిల్ బాక్సులను అలంకరించారు. ఆయనకు అనేక బహుమతులిచ్చి, కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. దీనిపై ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఆసక్తికరమైన కథనం ప్రచురించింది.
అట్లాంటా జర్నల్ కు చెందిన జెనిఫర్ బ్రెట్ అనే పాత్రికేయురాలు మార్టిన్ కోసం తన సొంతూరు ఏం చేస్తోందో తెలుసుకోవాలనుకున్నారు. దాంతో ఆయన రిటైర్మెంటు రోజు ఆయనతో పాటు ట్రక్కులో ప్రయాణించి మొత్తం 500 ఇళ్లు చూశారు. తర్వాత తాను చూసిందేంటో వాషింగ్టన్ పోస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫ్లాయిడ్ మార్టిన్ తమ సొంతూరులో ఓ సెలబ్రిటీ అన్నారు. ఒక్కో ఇంటివాళ్లు ఆయన గురించి ఒక్కో కథ చెప్పారన్నారు. పెద్దల కోసం పత్రికలు తేవడం, దారిలో ఉన్న పిల్లులకు ఏదో ఒక ఆహారం పెట్డడం, పిల్లలకు లాలీపాప్ తీసుకురావడం.. ఇవన్నీ మార్టిన్ అలవాట్లు. తన నాయనమ్మ డోరీన్ హిప్స్ (87)కు మతిమరుపు వచ్చి ఏమీ గుర్తుండటం లేదని.. కానీ పోస్టుమ్యాన్ మార్టిన్ ను మాత్రం ఇప్పటికీ గుర్తుపడుతుందని ఆమె మనవరాలు అమందా సీల్స్ చెప్పారు. జిమ్ పెట్రోవ్ స్కీ, ఆయన భార్య షార్లట్ ఇద్దరూ మార్టిన్ కు మంచి స్నేహితులు. పక్కింటి పిల్లలు ప్రతిరోజూ మార్టిన్ ఎప్పుడొస్తారా అని కిటికీ దగ్గరే ఉండేవారని, ఆయన తెచ్చే లాలీపాప్ కోసం ఎదురు చూసేవారని షార్లట్ తెలిపారు. తొలిసారి ఫ్లాయిడ్ ను కలిసినపుడే ఆయన చాలా పాత స్నేహితుడిలా అనిపించారన్నారు.
ఈ విషయాలన్నీ పంచుకున్న తర్వాత బ్రెట్ శుక్రవారం ఉదయం లేచి తన ఫోను చూసుకుంటే ట్విట్టర్ అప్పటికే మోతెక్కిపోతోంది. మార్టిన్ కథనం చూసి చాలామంది చలించిపోయారు. ఒకసారి హవాయి వెళ్లాలన్నది ఎప్పటినుంచో మార్టిన్ కల. దాన్ని నెరవేర్చాలని ఆ ప్రాంతంలో ఒకరు ‘గో ఫండ్ మీ’ మొదలుపెట్టారు. శుక్రవారం ఉదయానికల్లా అందులో దాదాపు రూ. 9 లక్షలు (13వేల డాలర్లు) పోగుపడ్డాయి. ఈయనను చూస్తుంటే తమ ప్రాంతంలోని పోస్ట్ మ్యాన్ రెగీ గుర్తుకొచ్చారని, వీళ్లు అద్భుతమైన వ్యక్తులని ఒకరన్నారు. అంతేకాదు, మార్టిన్ ను పూర్తి ఉచితంగా హవాయి తీసుకెళ్లి తీసుకొస్తామని డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధి స్వయంగా ఫోన్ చేసి బ్రెట్ కు చెప్పారు. ట్విట్టర్ కూడా అప్పుడప్పుడు ఇలా మంచి చేస్తుందని బ్రెట్ అన్నారు. 35 ఏళ్లుగా ఆ ప్రాంత వాసులకు సేవలు అందించడంతో ఫ్లాయిడ్ మార్టిన్ అందరికీ ఆప్తుడైపోయారు. రిటైరైనా ప్రతి ఒక్కరినీ పలకరిస్తానని, తన గురించి ఆలోచించినపుడు నవ్వుతానని ఫ్లాయిడ్ చెప్పారు.