ప్రకాశం జిల్లాలో “గ్రానైట్” రాజకీయం నడుస్తుంది. ఏళ్ల తరబడి అనధికార తవ్వకాలు, అక్రమ సంపాదనలతో ఆర్ధిక రథంపై ఊరేగిన గ్రానైట్ దొరల దొంగచాటు వ్యవహారాలూ ఒక్కోటి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఆరు నెలలుగా చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాల్లోని క్వారీల్లో సోదాలు, రికార్డుల తనిఖీలు జరిపిన విజిలెన్సు శాఖ క్వారీలపై రూ. రెండు వేల కోట్లు వరకు ఫైన్ వేసింది. వాటి నుండి తప్పించుకునే క్రమంలో పార్టీల మార్పులు, అధికార పార్టీతో సంప్రదింపులు, వాటాల విక్రయాలు, కోర్టులకు వెళ్ళడాలు ఇలా రకరకాల ఎత్తులు వేసుకుంటూ వస్తున్నారు. ఒక్కో క్వారీ సంస్థ ఒక్కోలా తమ ప్రయత్నాలను సాగిస్తుంది.
విజిలెన్సు మరింత లోతుకి…!
ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా విజలన్సు మాత్రం ఇంకా తమ తవ్వకాలను లోతుకి తీసుకెళ్తుంది. అత్యంత కీలకమైన దస్త్రాలు అందుబాటులో లేకపోవడం.., మరోవైపు గనులశాఖ సహకారం సరిగ్గా లేకపోవడంతో అసలైన తిమింగళాల లెక్క తేలడం లేదని తెలుస్తుంది. విజిలెన్సు మరింత లోతుగా విచారణకు కావాల్సిన రికార్డులు అడిగినా గనుల శాఖ అధికారుల నుండి ఏమాత్రం సహకారం లేకపోవడంతో ఇంటిదొంగల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి.
- జిల్లాలోని చీమకుర్తిలో గోల్డెన్ గ్రానైట్ అని ఒక క్వారీ సంస్థ ఉంది. ఈ క్వారీ నిజానికి లీజు సంస్థ. రెండు దశాబ్దాల కిందటే వేరే సంస్థ నుండి 80 శాతం, 20 శాతం వాటాలతో లీజుకి తీసుకుని నడుస్తుంది. ఈ లీజుల వాటాలతో పాటు పన్నుల చెల్లింపు, స్టాంప్ డ్యూటీ చెల్లింపు వ్యవహారాల్లో ఇద్దరికీ తేడాలు వచ్చాయి. రూ. వంద కోట్లకు పైగా ప్రభుత్వాదాయానికి గండి పడిందని ఫిర్యాదులున్నాయి. దీంతో విచారణకు ఆదేశించారు. విచారణ జరిగితే తమ బాగోతాలు బయటపడతాయని అసలు రికార్డులు (ఒరిజినల్ లైసెన్స్, లీజు కాపీ, ముందు, వెనుక లీజుల లెక్కలు) మాయం చేశారు. గత ఏడాది జులైలోనే ఈ రికార్డుల మాయంపై చర్చ జరిగింది. గనుల శాఖలో అంతర్గతంగా విచారణ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా విజిలెన్సు విచారణకు ఈ రికార్డుల అవసరం వచ్చింది. ఇవి లేక అసలు తంతు తేలడం లేదు. ఏడాదిగా విచారణ లోతుగా జరగకుండా తప్పించుకుంటున్నారు. తాజాగా కొలతలు, లీజుల తేడాతో విజలెన్సుకి చిక్కి రూ. వంద కోట్ల వరకు ఫైన్ కట్టాల్సిన ఈ సంస్థపై ఇంకా అక్రమాల వెలికితీత కొనసాగుతుంది. ఈ నెల 6 న విజిలెన్సు అధికారులు మళ్ళీ గనుల శాఖకు లేఖ రాశారు. గోల్డెన్ గ్రానైట్, కృష్ణ సాయి గ్రానైట్స్ (ఈ రెండు సంస్థలు మాజీ మంత్రి శిద్ధా కుటుంబికులవి) ఒరిజినల్ లీజు ఫైల్స్ అన్నిటినీ ఇవ్వాలని కోరారు. ఒక్క రోజులో ఇవ్వాలని కోరినా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇది గనుల శాఖతో పటు, విజిలెన్సు శాఖలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ప్రభుత్వ పెద్దలకు చేరింది. ఈ రెండు క్వారీపై నిఘా పెంచాలని, ఫైల్స్ ఇవ్వకుంటే లీజుల తాత్కాలికంగా రద్దు చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇక రూ. 2 వేల కోట్ల ఫైన్ ని గ్రానైట్ యజమానులు చెల్లించార లేదా? ఏ సంస్థ ఎలా ఫైన్ నుండి తప్పించుకుంది? రాజకీయంగా ఎటువంటి మార్పులు జరిగాయి? శిద్దా కుటుంబాల క్వారీల్లో రూ. వందల కోట్ల అక్రమాలకు కారణం ఏంటి? అనేక మలుపులో, చాలా చిత్రాలు ఉన్నాయి, అందుకే ఎలా, ఏమిటి అనేది తదుపరి కథనాల్లో చెప్పుకుందాం.