పొలిటికల్ మిర్రర్
పోటీ ఏదైనా విజయాలు ఊరికే రావు. బోలెడన్ని శక్తియుక్తులు ప్రదర్శించాలి. శ్రమపడాలి. ఆవగింజంత అదృష్టం తోడవ్వాలి. విజయాలన్నిటిలో రాజకీయ విజయాలంటే మరింత క్లిష్టం. శ్రమ, శక్తి కంటే యుక్తి తెలియాలి. జనం నాడి పట్టాలి. రాజకీయ వైద్యం చేయాలి. దేశంలో ప్రస్తుతం మార్మోగుతున్న విజేతల వెనుక ఉన్న ఓ నీడ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చాయ్ పే చర్చ…
రన్ ఫర్ యూనిటీ…
సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్… ఇవన్నీ వింటుంటే అందరికీ ప్రధాని మోదీ గుర్తుకువస్తారు. కానీ ఇవన్నీపుట్టిన బుర్ర మాత్రం విజేతల వెనుకున్న నీడదే. విజేతల నీడ, రాజకీయ నాడీవైద్యుడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేది. ఉత్తరాదిన ఆయనను ముద్దుగా “ఎలక్షన్ గురు” అని పిలుస్తుంటారు. 2012 లో గుజరాత్లో మోదీ విజయంతో మొదలైన పీకే హవా, నిన్నటి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ విజయం వరకు కొనసాగింది. ఇక ఏపీలో వైసిపి విజయంలో పీకే పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బీహార్ లోని కోనార్ అనే పల్లెలో పుట్టిన ఈ పీకే చదివింది పెద్ద పీజీలు, డాక్టరేట్లు కాదు… కేవలం రాజకీయమే. అదే చదువుకుని, అదే వృత్తిగా మార్చుకుని సంచలనాలు సృష్టిస్తున్నారు.
కొన్ని బహిరంగ రహస్యాలు… లోతుగా…!
పీకే అందరికీ తెలుసు. ఆయన విజయాలు అందరికీ తెలుసు. కానీ తెరవెనుక ఆయన పనితీరు గురించి కొంచెం లోతుగా వెళ్తే ఆసక్తికరంగా ఉంటుంది. చికిత్స చేయాలంటే ముందుగా రోగమేంటో తెలియాలి. రోగాన్ని పసిగట్టడం మానవ మాత్రుల వల్ల కాకపోవడంతో ఎన్నో యంత్రాలు వచ్చాయి. కానీ రాజకీయంలో రోగాన్ని పట్టుకునే యంత్రాలు లేవు. జనం నాడి పట్టుకోవడం ముఖ్యం. జనం మెదడుని తెలుసుకుని, అందులో ఆలోచన నాటడమే అసలైన వైద్యం. పీకే అందులో ఆరితేరారు. దీని వెనుక ఎంతో శ్రమ ఉంది. ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. దశల వారిగా ఆచరణ ఉంది. పార్టీలతో ఒప్పందం నుండి విజేతగా నిలిపే వరకు తెర వెనుక పనిచేసే శక్తి ఉంది. సింపుల్ గా చెప్పుకోవాలంటే కురుక్షేత్రంలో కృష్ణుడిలా… ఐ ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)ని సృష్టించి వందలాదిగా పీజి విద్యార్థులను, యువ రాజకీయ ప్రొఫెషనల్స్ను దీనిలో భాగం చేసి పీకే టీమ్ గా రూపొందించారు.
* నాయకత్వ విభాగం
* సాంకేతిక, విశ్లేషణ విభాగం
* డిజిటల్ డిజైన్, వీడియో విభాగం
* మీడియా వ్యవహారాల విభాగం
* క్షేత్ర పరిశీలనా విభాగం
* రాజకీయ నైపుణ్య విభాగం
* ఆర్ధిక, న్యాయ విభాగం… ఇన్ని అంగాలు ఐ ప్యాక్లో భాగం. వీటిలో సాదా సీదా సభ్యులు ఉండరు, ఐఐటి, ఐఐఎం వంటి సంస్థల్లో, పేరున్న విశ్వవిద్యాలయాల్లో చదివి ఆరితేరిన యువ బృందం ఉంటుంది. ఎన్నికలకు కనీసం రెండేళ్ల ముందు ఒప్పందం చేసుకుని దశల వారీగా ఈ విభాగాలు రంగంలోకి దిగుతాయి. పార్టీల నాయకులూ తెర పైన పని చేస్తుంటే ఈ విభాగాలు తెర వెనుక కీలకంగా పనిచేస్తాయి.
ఈ టీమ్ విడతలు వారీగా జనంతో, తటస్థ, ప్రత్యర్థి వర్గాలతో ఆంతరంగిక సంభాషణల ద్వారా నాడి పట్టుకుంటుంది. మెదడుని చదివేస్తుంది. తద్వారా ఇవిఎంలో ఓటు పడాలంటే ఆ మెదడుకి ఏమివ్వాలో, ఏ ఆలోచనలు రగిలించాలో పరోక్ష ప్రణాళికలు వేసి, ప్రత్యక్షంగా పార్టీల ద్వారా రగిలించేస్తుంది. అందుకు ఉదాహరణ ఏపీలో నవరత్నాలు. 2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఈ రత్నాలను వైఎస్ జగన్ ప్రకటించేసి, జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లారు. సమార శంఖారావం, ప్రజా సంకల్పయాత్ర వంటివి రూపొందించి విజేతగా నిలవడంలో పాత్ర పోషించారు. గుజరాత్ లో 2012 మోదీకి, 2014 లో దేశవ్యాప్తంగా బిజెపికి, 2015 లో బీహార్లో జేడీయూకి, 2016 లో పంజాబ్, 2017 లో యూపీ, నేడు ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కి ఇదే సూత్రంతో పనిచేశారు. ఇక రానున్న రోజుల్లో తమిళనాడులో డీఎంకేకి, పశ్చిమ బంగలో మమతా బెనర్జీకి పని చేయనున్నారు
శ్రీనివాస్ మానెం