(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
న్యూఢిల్లీ: పికె ఎవరో తనకు తెలియదంటూ కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జెడియు నేత ప్రశాంత్ కిషోర్. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ను అమ్ అద్మీ పార్టీ తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ గెలుపు కోసం పికె పని చేస్తున్నారు. మరో పక్క ఢిల్లీ ఎన్నికలకు బిజెపి కోఇన్చార్జిగా కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ప్రశాంత్ కిషోర్ ఎవరు, అతను ఎవరో నాకు తెలియదు, ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు’ అని హరిదీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ ‘ఆయనో సీనియర్ మంత్రి, నా లాంటి సామాన్యుడి గురించి ఆయనకు తెలియాలని ఏముంది. నాలాగే యుపి, బీహార్ల నుండి లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి బతుకుపోరు సాగిస్తున్నారు. వారి గురించి పూరి లాంటి సీనియర్ నేతకు ఎలా తెలుస్తుంది’ అంటూ ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. బిజెపి నేతలకు సంపన్నులే తెలుస్తారు, సామాన్యుల గురించి వారికి తెలియదన్న అర్థం వచ్చేలా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు.