(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్”ప్రతినిధి)
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా ఏజన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపడలేదు. దీంతో ఏజన్సీ ప్రాంతాలకు చెందిన అత్యవసర వైద్య సేవలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతున్నా మారుమూల పల్లెలకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధారపత్రి గ్రామ పంచాయతీ పరిధిలోని దుంగాడ గ్రామానికి ఇప్పటికై సరైన రహదారి సౌకర్యం లేదు. ఈ గ్రామానికి చెందిన గర్బిణీ స్త్రీ కస్తూరి దేవుడమ్మ (20) నెలలు నిండాయి. తొలి కాన్పు ప్రసవేదన పడుతుంటే ఆమెను గిరిజనులు డోలిలో 9 కిలో మీటర్లు మోసుకుని మైదాన ప్రాంతమైన దుబ్బాగుంటకు తీసుకువచ్చారు. 108 అంబులెన్స్కు కాల్ చేసి అక్కడి సమీపంలోని
ఒ చెట్టు నీడన గంటన్నర పాటు నిరీక్షించినా అంబులెన్స్ రాకపోవడంతో ఆమెను ఆటోలో శృంగవరపుకో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఏజన్సీ ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనలు అత్యవసర వైద్య సేవల సమయంలో బాదితులను డోలీతోనే మైదాన ప్రాంతాలకు తీసుకురావడం చాలా కాలంగా జరుగుతోంది. అయితే దుంగాడ గ్రామానికి చెందిన గర్బిణీ స్త్రీని డోలీలో గిరిజనులు మైదాన ప్రాంతానికి తీసుకువస్తున్న వీడియోను సోషల్ మీడియాలో ఏఏన్ఐ పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది. దీనిని పురస్కరించుకొని పలువురు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా మరి కొందరు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటివి ఎందుకు వెలుగులోకి తీసుకురావడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. పాలకులు ఇప్పటికైనా ఏజన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.