ముంబాయి, డిసెంబరు29: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మూవీ విడుదలకు ముందే ప్రదర్శన కావాలని మన్మోహన్ అడిగితే ప్రత్యేకంగా చూపిస్తామని నటుడు అనుపమ్ఖేర్ తెలిపారు. శుక్రవారం అనుపమ్ఖేర్ మీడియాతో మాట్లాడుతూ, ఒకసారి సెన్సార్ అనుమతి ఇచ్చిన తర్వాత సినిమా విడుదలకు ముందే సినిమా ప్రదర్శన కోరే హక్కు ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు.
అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్ర పోషించారు. ఈ సినిమా ట్రైలర్ను బిజెపి అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది. అప్పటి నుంచి రాజకీయ వివాదం దీని చుట్టూ సుళ్లు తిరుగుతోంది. దీనిపై స్పందించేందుకు మాజీ ప్రధాని నిరాకరించారు. సినిమా ముందస్తు ప్రదర్శన చేయాలని మహారాష్ర్ట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యజీత్ తాంబే పాటిల్ చిత్ర నిర్మాతకు లేఖ రాశాడు.
‘వాస్తవాల ఆధారంగానే సంజయ్ బారు రాసిన పుస్తకంలో ఉన్నట్లుగా చిత్రాన్ని రూపొందించాం. సినిమాకు పూర్తి హక్కులు తీసుకున్నాం. అందరికీ అన్ని విషయాలు స్పష్టంగా తెలుసు. ఎందుకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలి? భాజపాకు మద్దతుగా సినిమా చేయాల్సిన అవసరంలేదు’ అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.