న్యూఢిల్లీ: ప్రజల పేరిట రాజకీయాలు చేస్తున్నవారు ఎప్పటికీ ప్రజల బాధలను అర్థం చేసుకోరని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మోదీ ధన్యవాద సభ జరిగింది. ఈ సభలో మోదీ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ విశిష్టత అని నినదిస్తూ మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాలు, ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఏఏపై ఆందోళనకారులను రెచ్చగొట్టేలా కొంతమంది తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నారని మోదీ ఆరోపించారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తాము కేవలం పేదల కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతిఒక్కరూ పార్లమెంటు నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. ఎనిమిది కోట్ల మందికిపైగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. అప్పుడు మతాలను చూశామా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు ఉజ్వల పధకం పేరుతో లబ్ది పొందుతున్నారని తెలిపారు. జాతి, మతాలను చూడకుండా పేదరికాన్ని మాత్రమే చూసి సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామన్నారు.
‘మీకు నేను నచ్చకపోతే నన్ను ద్వేషించండి. మోదీని తిట్టండి. మోదీకి వ్యతిరేకంగా ఎన్ని ర్యాలీలైన చేసుకోండి. కానీ, పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దు’అని మోదీ పేర్కొన్నారు. ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ అన్న నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎన్నో త్యాగాలు, కష్టనష్టాలకు ఓర్చుకుంటూ విధి నిర్వహణ సాగిస్తున్న పోలీసులపై రాళ్లు రువ్వడాలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. పోలీసు సిబ్బంది పట్ల మనం అనుసరించాల్సిన వైఖరి ఇదేనా అని నిలదీశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం వేల మంది పోలీసు సిబ్బంది ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు. సీఏఏ విషయంలో భారతీయ ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని భరోసా ఇచ్చారు.
స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఢిల్లీ ప్రజలు ఇంకా భయం, అస్థిరత, తప్పుడు హామీల మధ్య జీవించాల్సి వచ్చిందని మోదీ అన్నారు. ఆప్ ప్రభుత్వానికి దూర దృష్టి లేదన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తాగునీటి సమస్యను ఎలా పరిష్కరించాలో అర్ధం కాలేదని విమర్శించారు. మెట్రో ఫేస్ 4 అంశాన్ని ఆప్ రాజకీయం చేసిందని, లేదంటే ప్రాజెక్టు ఎప్పుడో పూర్తియి ఉండేదని చెప్పారు. అనధికార కాలనీవాసులకు యాజమాన్య హక్కులు కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా చేశామన్నారు. అతితక్కువ సమయంలో
కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ సభకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.