(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతకోసం రోజుకు 1.62 కోట్ల రూపాయలు ఖర్టవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎస్పిజి భద్రత ఒక్క ప్రధానికి మాత్రమే ఉంది. ఈ భద్రతకు రోజుకు కోటీ 62 లక్షలు ఖర్చవుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి లోక్సభకు తెలిపారు.
దేశంలో ఎంతమంది ప్రముఖులకు ఎస్పిజి, సిఆర్పిఎఫ్ భద్రత కల్పిస్తున్నారన్న డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు కిషన్రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ఒకే ఒక్క వ్యక్తి ఎస్పీజీ భద్రత పొందుతున్నారంటూ పరోక్షంగా ప్రధాని మోడీ పేరును ప్రస్తావించిన మంత్రి.. ఇందుకోసం రోజుకు దాదాపు 1.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు మొత్తంగా 56 మంది విఐపిలకు సిఆర్పిఎఫ్ భద్రత కల్పిస్తున్నట్టు కిషన్రెడ్డి తెలిపారు.
మూడు వేలమంది ప్రత్యేక కమాండోలతో పని చేసే ఎస్పిజికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో 592.55 కోట్ల రూపాయలు కేటాయించారు. గతంలో ఇది 540 కోట్లు కాగా, ఈసారి అది 10శాతం పెరిగింది. నిన్నమొన్నటి వరకు ప్రధానితోపాటు గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉండగా, గతేడాది నవంబరులో కేంద్రం దానిని తొలగించింది.