అమేథీ: వారణాసి నుంచి తాను పోటీ చేయకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ స్టార్ ప్రచారకురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. తాను ఉత్తరప్రదేశ్లోని తూర్పు భాగానికి ఇన్ఛార్జిగా ఉన్నానని, అక్కడ ఉన్న 41 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోవలసిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. అవే కాక, ఇంకా చాలా మంది అభ్యర్థుల నియోజవర్గాల్లో ప్రచారం చేయాల్సి ఉన్నందునే తాను పోటీ చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వారణాసిలో ప్రధాని మోదీపై పోటీచేసి, అక్కడ తన విజయం కోసం ప్రయత్నిస్తూ మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల విజయావకాశాలను చేజార్చుకోవడం సరికాదని తాను భావించినట్లు ఆమె తెలిపారు. పార్టీలోని సీనియర్ నాయకులు పలువురిని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు. పార్టీ కూడా ఇదే విషయాన్ని తనకు చెప్పిందని, పార్టీ ఎలా చెబితే తాను అలానే చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.
ప్రియాంక కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ‘మీరు కూడా పోటీ చేస్తారా అని ఎంతో మంది అడిగిన ప్రశ్నలకు పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటా’ అని ఆమె చెబుతూ వచ్చారు. ప్రియాంక కచ్చితంగా పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడిన తర్వాత ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే సందిగ్ధం నెలకొంది. ఈ విషయంలో సామాజిక మాధ్యమంలో ఒకరు అడిగిన ప్రశ్నకు ‘వారణాసి నుంచి నేను ఎందుకు పోటీ చేయకూడదు’ అంటూ ఆమె బదులిచ్చారు. ఆ సమాధానంతో ఆమె వారిణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేయనున్నారనే వాదనలకు బలం చేకూరింది. తర్వాత వారణాసి నుంచి కాంగ్రెస్ పార్టీ పాత అభ్యర్థినే మరోసారి బరిలోకి దించింది. అయితే ప్రియాంక ఎందుకు పోటీ చేయట్లేదంటూ ఎన్నో చర్చలు జరిగాయి. వీటన్నిటికీ తెరదించేందుకు.. అది పార్టీ తీసుకున్న నిర్ణయమని రాహుల్, ప్రియాంకా తెలిపారు. అందుకు కారణమేంటాననే చర్చ మాత్రం అన్ని వర్గాల ప్రజలలో వచ్చింది. దీంతో ప్రియాంక నేరుగా ఈ విషయాన్ని ప్రస్తావించి, ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారు.