హైదరాబాద్: తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదనీ హతురాలు ప్రియాంకరెడ్డి తండ్రి శ్రీధర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ శివారులో డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు లారీ డ్రైవర్లు అత్యాచారం చేసి ఆ తరువాత హతమార్చి దహనం చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి తన కుమార్తె మిస్తైందని ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వెళితే ఎవరితో లేచిపోయిందోనంటూ పోలీసులు అమర్యాదగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మిస్సింగ్ కేసు తమ పరిధిలోకి రాదని శంషాబాద్ పోలీసులు చెప్పారనీ, రూరల్ పిఎస్లో ఫిర్యాదు చేయమన్నారని ప్రియాంక తండ్రి తెలిపారు. తీరా అక్కడకి వెళితే ప్రియాంక అదృశ్యమైన ప్రాంతం శంషాబాద్ కిందకే వస్తుందన్నారని ఇలా ఫిర్యాదు తీసుకోవడానికే రెండు, మూడు గంటల పాటు తిప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నుండే తీవ్ర జాప్యం జరిగిందనీ, ముందే పోలీసులు స్పందించి చర్యలు చేపట్టినట్లైయితే తమ కుమార్తె బతికి ఉండేదని ఆయన వాపోయారు.
అయితే ఘటన జరిగిన అనంతరం పోలీసులు కేసును 24 గంటల్లో ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను హోంమంత్రి మహమూద్ ఆలీ, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.