న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పార్టీలో సమస్యలు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా దూరంగా వెళ్లిపోతున్నారని, తమకు అదే పెద్ద సమస్య అని వ్యాఖ్యానించారు. రాహుల్ వైఖరితో పార్టీలో ఓ రకమైన శూన్యం ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నా, కుదరడం లేదని అన్నారు. ఈ నెలలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం పార్టీ స్థితిగతులపై ఖుర్షీద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ రాజీనామా నిర్ణయం కారణంగా లోక్సభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను కూడా పార్టీ విశ్లేషించలేకపోయిందన్నారు. పార్టీ నేత తమను విడిచిపెట్టడమే పెద్ద సమస్య అని, రాహుల్ రాజీనామా చేసిన తరువాత పార్టీ ఆగమ్యగోచరంగా మారిందన్నారు. సోనియా గాంధీ పార్టీలో తాత్కాలిక ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ సమస్య మరింతగా పెరిగిదన్నారు. యూపీలోని 80 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం, స్వయంగా రాహుల్ గాంధీ అమేథీ ఓడిపోవడం క్లిష్ట పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. తాము వద్దని చెప్పినా… రాహుల్ మాత్రం అధ్యక్ష హోదా నుంచి తప్పుకున్నారని సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు.
లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ.. ఆ ఎన్నికల ఫలితాల అనంతరం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.