ఓట్లు వేయడానికి నకిలీ వేళ్లు వస్తున్నాయంటూ ఇటీవల సోషల్ మీడియాతో పాటు ప్రధాన స్రవంతి మీడియాలో కూడా కొన్ని వార్తలు వ్యాపించాయి. వుయ్ సపోర్ట్ రిపబ్లిక్ అనే ఫేస్ బుక్ గ్రూపుతో పాటు మరి కొన్ని గ్రూపులు కూడా దీన్ని షేర్ చేసుకున్నాయి. పలువురు వ్యక్తులు కూడా దీన్ని షేర్ చేసుకున్నారు. ట్విట్టర్ లో కూడా ఈ నకిలీ వేళ్ల వ్యవహారం గురించి ప్రచారం జరిగింది.
ఏది నిజం?
ఆల్ట్ న్యూస్ ప్రతినిధులు గూగుల్ ద్వారా ఈ ఫొటోను రివర్స్ సెర్చ్ చేస్తే.. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ నకిలీ వేళ్ల వ్యవహారం మీద వార్తలు, కథనాలు వచ్చినట్లు తెలిసింది. ఎక్కువగా తప్పుడు సమాచారాన్ని తరచు ప్రచారం చేసే అభిషేక్ మిశ్రా అనే వ్యక్తి సహా పలువురు దీన్ని అప్పట్లో పోస్ట్ చేశారు. కానీ, అతడు తర్వాత దీన్ని డిలీట్ చేసేశాడు.
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషీ తనకు వాట్సాప్ ద్వారా వచ్చిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దానిపై తనకు ఎవరో పంపారని చెప్పారు.
Someone sent this! pic.twitter.com/bnwRZLSLiL
— Dr. S.Y. Quraishi (@DrSYQuraishi) February 20, 2017
ఖురేషీ ట్వీట్ మీద పలువురు వ్యాఖ్యానాలు చేశారు. ‘యకుజా’ సభ్యుల కోసం ఈ వేళ్లను తయారుచేసినట్లు కొంతమంది అందులో చెప్పారు. ఈ సందేశంలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయాన్ని 2017లోనే బీబీసీ గాలించింది. ఇదే విషయమై ఏబీసీ న్యూస్ కథనం 2013లో ఒకటి వచ్చింది. ‘‘జపాన్ దేశంలో యకుజా అనే మాఫియా సభ్యులు కొత్త మోసానికి పాల్పడుతున్నారు. ‘యుబిట్సుమె’ అనే ఆచారం ప్రకారం తీవ్రమైన నేరాలు చేసినప్పుడు యకుజా సభ్యులు తమ వేళ్లను నరికేసుకోవాలి. ముందుగా ఎడమచేతి చూపుడువేలు పోతుంది. తరచు ఇలా నేరాలు చేస్తూ ఉంటే మిగిలిన వేళ్లు కూడా పోతాయి. ఇలా వేళ్లు పోయినప్పుడు వాళ్లకు పని దొరకండం కూడా కష్టం అవుతుంది’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇలా వేళ్లు లేనివారికి కృత్రిమ వేళ్లను తయారుచేసి, జపాన్ మాఫియా ఉపయోగించేది. దాని బొమ్మలనే ఇప్పుడు ఓట్లు వేయడానికి నకిలీ వేళ్లు వస్తున్నాయని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తెలుగులో వచ్చే ఓ ప్రధాన దినపత్రిక కూడా దీనిపై వ్యాసం ప్రచురించడం గమనార్హం. ఎన్నికలు జరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సందర్భాలలో పాత ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేసి, నకిలీ ఓట్లు వేయడానికి కొందరు బురఖాలలో వస్తున్నట్లు చెప్పేవారు.