న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో కాలుష్య నియంత్రణ అధారిటీ ఢిల్లీలో ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. గత కొంతకాలంగా ఢిల్లీ కాలుష్య స్థాయి నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల వ్యర్థాలు భారీగా తగలబడుతుండడంతో ఢిల్లీ నగరాన్ని కాలుష్య మేఘాలు చుట్టుముట్టాయి. దీంతో వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 5 వరకు పాఠశాలలు మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. అన్ని పాఠశాలలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
दिल्ली में पराली के बढ़ते धुएँ के चलते प्रदूषण का स्तर बहुत ज़्यादा बढ़ गया है. इसलिए सरकार ने निर्णय लिया है कि दिल्ली के सभी स्कूल 5 नवम्बर तक बंद रहेंगे
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 1, 2019
ప్రస్తుతం ఢిల్లీలో పొల్యూషన్ కేటగిరీ… ‘తీవ్రం’గా ఉందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తేల్చింది. ఢిల్లీ చుట్టుపక్కల నవంబర్ 5 వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కాలుష్య నియంత్రణ అధారిటీ ఆదేశాలు ఇచ్చింది. చలికాలం మొత్తం ఎవరూ టపాసులు కాల్చవద్దని ఆదేశించింది. ఢిల్లీ పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలు.. ఈ పొలాలను తగలబెట్టే అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పంట నూర్పిళ్ల తర్వాత మిగిలిన గడ్డిని కొందరు రైతులు పొలాల్లోనే తగలబెట్టేస్తున్నారు. దీంతో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది. కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్యంతో..నగరంలో పట్టపగలే ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. నగరవాసులు మాస్కులు లేకుండా బైటకు రాలేని దుస్థితి నెలకొంది.