మొన్నటి ప్రెస్ మీట్ లో కేసీఆర్ అనే ఓ మేధావి ఓ అపార మేధావుల పదాన్ని వాడాడు… ఆర్ధిక వేత్తల, మనీ మేధావులు వాడే పదాన్ని ప్రయోగించి తాను ఎంతటి నిపుణుడినో చెప్పే ప్రయత్నం చేసాడు. భేష్… ఆయన నిపుణుడే.., రాజకీయంగా, మాటల పరంగా, తెలివి పరంగా నిపుణుడే… ఆ విషయాన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన వాడిన బ్రహ్మ పదం “క్వాంటిటేటివ్ ఈజింగ్” అంటే ఏంటో చాల మంది తలలు గోక్కుంటున్నారు. గూగుల్ తల్లి కూడా సరిగా చూపించడం లేదు… అందుకే అసలు అదేంటో, దాని ద్వారా ఒనగూరే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం…!
నిజమే 10 లక్షల కోట్లు అవసరమే…!
కేసీఆర్ అన్నట్టు దేశాన ఇప్పుడు 203 లక్షల కోట్ల జిడిపి ఉంది. దీనిలో 5 శాతం మనకు తక్షణ అవసరం అంటే కనీసం రూ. 10 లక్షల కోట్లు లేకుంటే దేశాన ఆర్ధిక లోటు తీరదు. అన్ని రాష్ట్రాలకు ఉద్దీపన ద్వారా రూ. 5 లక్షల కోట్లు ఇచ్చినా, మిగిలిన నగదు ద్వారా ముందస్తు చర్యలు తీసుకునే వీలుంటుంది. దీనికి సరైన మార్గమే కేసీఆరుడు వాడిన “క్వాంటిటేటివ్ ఈజింగ్”, అండ్ “హెలికాఫ్టర్ మని”..!
ఆస్తులను అమ్మడమేనా…!
ఏదైనా దేశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చులు రాబడి కంటే విపరీతంగా పెరిగిపోయి, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారినప్పుడు, తన వద్ద ఉన్న బాండ్లను, ఇతర ఆర్థిక ఆస్తులను అమ్మి, ఆ లోటును పూడ్చుకోవడమే క్వాంటిటేటివ్ ఈజింగ్. అంటే నీకు, నీ ఇంటికి ఆర్ధిక లోటు వస్తే బ్యాంకు ఋణం రూపం లో ఇస్తుంది, ప్రభుత్వానికి, కేంద్రానికి, దేశానికి ఋణం తీసుకునే అవకాశం ఉన్నా,.. అది కూడా తలకు భారమే అని భావించినప్పుడు ఈ “క్వాంటిటేటివ్ ఈజింగ్” కి వెళ్తారు. అంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు నేరుగా దేశ ఆర్ధిక లావాదేవీల్లో కల్పించుకుని మార్కెట్ లో కొనుగోళ్లు, పెట్టుబడులు పెరిగేలా కొంత భరోసా ఇస్తుంది.
ఆర్బిఐ పాత్ర కీలకం…!
ఈ పద్ధతిలో ఆ బాండ్లను కొనవలసింది భారత రిజర్వ్ బ్యాంకు. వడ్డీ రేటుతో సంబంధం లేకుండా లభించే ఈ సంపదను రాష్ట్రం తన ఆర్థిక వ్యవస్థలోకి పంపి, ప్రజల కొనుగోలు శక్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక సంతులతను స్థిరీకరిస్తుంది. సాధారణంగా ఈ పద్ధతిని ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నప్పుడు వాడటం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతారు. అదనంగా డబ్బు మార్కెట్లోకి రావడం వల్ల ద్రవ్యలభ్యత ఎక్కువవుతుంది. రుణాల లభ్యత చాలా సులభంగా ఉంటుంది. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని, కొనుగోలు శక్తిని పెంచుకుంటారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదురుకుంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లంటే, తన స్వంత ఆర్థిక ఆస్తులన్నమాట. వీటినే ‘స్టేట్ డెవలప్మెంట్ లోన్స్’ గా కూడా వ్యవహరిస్తారు. ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముందుగా ఒప్పుకున్న శాతాన్ని చెల్లిస్తూ, చివరికి అసలు మొత్తాన్ని చెల్లించడమే ఈ పద్ధతి.
- ఉదాహరణకు, ఒక రాష్ట్రం ఓ పది కోట్లకు బాండ్ను విడుదల చేస్తే, రిజర్వ్ బ్యాంకు దాన్ని 10శాతం వార్షిక చెల్లింపు నిబంధన కింద 10 సంవత్సరాలకు తీసుకుందని అనుకుందాం. అంటే, ప్రతి సంవత్సరం కోటి రూపాయలు ఆ రాష్ట్రం చెల్లిస్తూ, పదేళ్లు నిండాక అసలు మొత్తం పది కోట్లు చెల్లించాల్సిఉంటుంది. ఇదే క్వాంటిటేటివ్ ఈజింగ్. ఈ పద్ధతిని ముందుగా జాన్ మేనార్డ్ కేన్స్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడని అంటారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ ముందుగా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ పద్ధతిని అమెరికా, యూరప్లలో అవలంబిస్తున్నారు.
హెలీకాప్టర్ మనీ అంటే ఆకాశం నుండి వస్తుందా…!
హెలీకాప్టర్ మనీ అనేది క్వాంటిటేటివ్ ఈజింగ్తో పోలస్తే భిన్నమైనదీ, అరుదైనది కూడా. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయి, ప్రజల కొనుగోలు శక్తి శూన్యమయినప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కేంద్ర బ్యాంకు ప్రజలకు (వినియోగదారులకు) నేరుగా డబ్బు పంపిణీ చేస్తుంది. అంటే, మన బ్యాంకు అకౌంట్లో లక్షలకు లక్షలు వచ్చి పడటం కాదు కానీ, ఇంచుమించు అలాంటిదే. ఏదో ఉద్దీపనలు మార్గంలో ప్రజల ఖాతాలకు నగదు చేరుతుంది. వడ్డీ లేని ఋణం రూపంలో కూడా కావచ్చు.
ప్రజల ఆదాయం, ఖర్చుల కంటే తగ్గిపోయినప్పుడు వారేది కొనడానికి ఆసక్తి చూపరు. అలా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ఉత్పత్తుల ధరలు పడిపోతాయి. దీన్నే ప్రతిద్రవ్యోల్బణం లేదా డిఫ్లేషన్ అంటారు. దీన్ని నివారించాలంటే, ప్రజలకు అయాచితంగా డబ్బు అందాలి. దాంతో వారు మార్కెట్ల మీద పడి, విపరీతంగా కొనుగోలు చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు భారీగా ప్రవేశించి సంక్షోభం నుంచి గట్టెక్కుతుంది. హెలీకాప్టర్ ద్వరా డబ్బు వెదజల్లితే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అందుకే ఈ ద్రవ్య విధానానికి ఈ పేరు పెట్టారు.