బీజేపీ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ అవిరళ కృషి
పలు రాష్ట్రాల్లో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం
(స్మృతి కక్ రామచంద్రన్)
పొడవు చేతుల తెల్ల చొక్కా, ముదురు ఖాకీ రంగు ప్యాంటు, తలపై నల్ల టోపీ, ఎడమచేతి నుంచి భుజం మీద వాలిన కర్ర.. ఈ యూనిఫాం చూడగానే ఎవరినైనా వెంటనే ఆర్ఎస్ఎస్ మనిషని గుర్తుపట్టచ్చు. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ రెండోసారి కూడా ఇంత భారీ విజయం సాధించిందంటే అది కేవలం జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రభుత్వం చేసిన కృషి ఫలితం మాత్రమే కాదు. హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడంలో తెరవెనుక జరిగిన సోషల్ ఇంజనీరింగ్ పాత్ర కూడా అందులో చాలానే ఉంది. బీజేపీ సైద్ధాంతిక మూలమైన ఆర్ఎస్ఎస్ ఈసారి పార్టీ విజయానికి అవిరళ కృషిచేసింది. స్వయం సేవకులు అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. కుల సమీకరణల ఆధారంగా ఓట్ల ఏకీకరణ పెద్ద సమస్యగా మారడంతో ఆ అడ్డంకిని అధిగమించేందుకు ఆర్ఎస్ఎస్ గట్టిగా పనిచేసింది. ముఖ్యంగా హిందీబెల్టులో సంస్థ ప్రభావం చాలా ఉంది.
భద్రత, విధానాలు, అంతర్జాతీయ వ్యవహారాలలో గట్టి నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడని బలమైన ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకున్నారని ఆర్ఎస్ఎస్ సీనియర్లు తెలిపారు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో కుల ప్రభావం చాలా ఎక్కువ. అక్కడ బీజేపీ బలం పుంజుకోవడం సంఘ్ ను సంతృప్తిపరిచింది. ఎస్పీ-బీఎస్పీ కలవడంతో యూపీలో కుల సమీకరణాలు మారతాయనుకున్నారు. కానీ, జాతీయ భద్రత లాంటి అంశాల్లో ప్రభుత్వం బాగా పనిచేసిందని ఆర్ఎస్ఎష్ సీనియర్ ఒకరు అన్నారు. బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్థాన్ కు చైనా మద్దతు కూడా దూరమైందని ఆయన గుర్తుచేశారు. కుల ఆధారిత రాజకీయాలు ఓటర్లపై పట్టు కోల్పోతున్నాయని ఈసారి నిరూపితమైంది.
‘‘ఈసారి ఎన్నికలలో అందరినీ కలుపుకొని వెళ్లే, పవిత్రమైన భారతదేశానికి, కుల మతాలు, వ్యక్తిగత లబ్ధి కోసం సమాజాన్ని విడదీసే పలు రకాల గుర్తింపులకు మధ్య పోరాటం జరిగింది’’ అని ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య తెలిపారు. బీజేపీ ఓట్లశాతం భారీగా పెరిగిందంటే, ప్రతిపక్షాలు ఆరోపించినట్లుగా అది మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం కాదన్న విషయం తెలుస్తోందని ఆర్ఎస్ఎస్ నేతలు అంటున్నారు. ఎస్సీ ఎస్టీలను బీజేపీకి దూరం చేసేందుకు కుట్రతో కూడిన ప్రచారం జరిగిందని, కానీ వాళ్లంతా ప్రభుత్వ విధానాల వల్ల లబ్ధి పొందారని యూపీకి చెందిన మరో ఆర్ఎస్ఎస్ నేత చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలోని ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలలో ఈసారి ఇబ్బందులొస్తాయని ఆర్ఎస్ఎస్ ఊహించింది. దాంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. రాజస్థాన్ లో గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లా బీజేపీలో చేరారు. హర్యానాలో జాట్లు కూడా మద్దతిచ్చారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ సోషల్ ఇంజనీరింగ్ ఫలితమే. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం విషయంలో ఆగ్రహంతో ఉన్న అగ్రవర్ణాలనూ ఈబీసీ కోటాతో సంతృప్తి పరచగలిగారు.
ఈసారి కుల రాజకీయాలు దూరమయ్యాయనడానికి ఫలితాలే నిదర్శనమని, బీజేపీ అసలు ఛేదించలేదనుకున్న కోటలను కూడా బద్దలు కొట్టిందని దక్షిణాది రాష్ట్రాలను ఉద్దేశించి మరో ఆర్ఎస్ఎస్ నేత అన్నారు. మరోసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం భారతదేశం చేసుకున్న అదృష్టమని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. ఇది జాతీయ శక్తుల విజయమని, ఈ ప్రజాస్వామ్య విజయానికి సేవలందించిన ప్రతి ఒక్కరికీ అభినందనలని ఆయన చెప్పారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక విద్వేషాలకు ముగింపు పలికి, ప్రజాతీర్పును సగౌరవంగా మన్నించాలని ఆయన సూచించారు.
హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో