పట్నా: ఇంటికి పెద్ద కొడుకు కాస్తా ఇంటికి దూరం కావడంతో బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి అతడిని ఇంటికి రావాలని పిలిచారు. ఈమేరకు ఆమె చాలా దీనంగా అతడిని వేడుకోవడం అందరికీ ఆవేదన కలిగించింది. బిహార్ లో ఏడు దశల్లోనూ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిదశ ముగియగానే మర్నాడు రబ్రీదేవి తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఇంటికి తిరిగి రావాలని కోరారు. ‘‘ఇప్పటికే జరగాల్సిందంతా జరిగింది.. ఇక తిరిగి వచ్చెయ్యి నాయనా’’ అని ఆమె కోరారు. పట్నాలోనే ఉంటున్నా, అందరితో కలిసి ఇంట్లో కాకుండా బయట వేరేగా అతడు ఉంటున్నాడు.
గత సంవత్సరం తన తండ్రి లాలు ప్రసాద్ ను రాంచీలో చూసి వచ్చిన తర్వాత నుంచి అతడు ఇంటికి రాలేదు. తన భార్య ఐశ్వర్యారాయ్ తో తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో అతడు పిటిషన్ దాఖలుచేశాడు. ఆర్జేడీ నాయకుడు చంద్రికారాయ్ కుమార్తెను అతడు పెళ్లి చేసుకున్నా, ఇద్దరికీ అస్సలు కుదరలేదు. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజిలో చదివిన హైఫై మహిళ కాగా, తేజ్ ప్రతాప్ అచ్చంగా ఆవులతో ఆడుకునే వ్యక్తి.
అయితే, తన తమ్ముడు తేజస్వితో తేజ్ ప్రతాప్ కు విభేదాలున్నట్లు వస్తున్న వార్తలను వాళ్ల తల్లి రబ్రీదేవి ఖండించారు. ఇదంతా స్వార్థ ప్రయోజనాల కోసం సృష్టించిన వదంతి అని ఆమె అన్నారు. తన కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. కొంతమంది వ్యక్తులు తన కొడుకును తప్పుదోవ పట్టిస్తున్నారని, దాని వెనక తమ శత్రువులు బీజేపీ, జేడీయూ ఉండొచ్చని ఆమె అన్నారు. తాను రోజూ తన కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నానని చెప్పారు. ‘‘ఇప్పటికే లాలూజీ లేక చాలా బాధపడుతున్నాను. ఆయన ఇంట్లో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన లేనిదే ఎంత ఉండి ప్రయోజనం ఏముంది? త్వరలోనే ఆయన తిరిగి వస్తారని ఆశిస్తున్నా’’ అని కూడా రబ్రీదేవి అన్నారు.