న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం లోక్ సభలో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళనకు దిగారు. దేశంలోని మహిళలందరికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జార్ఖండ్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ.. భారత్ మేకిన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం లోక్ సభ సమావేశం ప్రారంభం కాగానే.. బీజేపీ మహిళా ఎంపీలు ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ రాహుల్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ దేశంలోని మహిళలకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నాడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘మేకిన్ ఇండియాను అత్యాచారలతో పోల్చుతూ ఓ రాజకీయ నేత వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదేనా రాహుల్ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం‘అని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. మగాళ్లు అందరూ రేపిస్టులు కాదు.. ఆ విషయాన్ని రాహుల్ గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు.
అయితే, రాహూల్ గాంధీ చేసిన ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలను డీఎంకే నేత, ఎంపీ కనిమొళి సమర్థించారు. రాహూల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ అనే నినాదం ఇచ్చారు. అయితే అది ఎక్కడా అమలు జరగడం లేదు. కానీ దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. దానినే రాహుల్ గాంధీ వివరించాలనుకున్నారు, అంతేకానీ అందులో వేరే ఉద్దేశమేమీ లేదు’ అని కనిమొళి వ్యాఖ్యానించారు.