సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోయేది మేమే
మాపై ఎన్నికల కమిషన్ పక్షపాతం
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దాదాపు ముగింపు దశకు వచ్చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతిపక్షం విషయంలో ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ అంతర్గత సర్వే ప్రకారం బీజేపీ ఓటమి ఖాయమని తేలిందన్నారు. మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, ప్రధాని ఉద్యోగాల గురించి గానీ, రైతుల గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఇచ్చిన రెండుకోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని రాహుల్ ప్రశ్నించారు.
జైషే మహ్మద్ అధిపతి మసూద్ అజహర్ ను బ్లాక్ లిస్టులో పెట్టిన ఘనత మోదీ తీసుకోడాన్ని రాహుల్ ఖండించారు. అతడిని పాకిస్థాన్ కు పంపింది ఎవరో అడగాలని ప్రజలకు చెప్పారు. ఉగ్రవాదం విషయంలో బీజేపీ రాజీపడుతుందని, కాంగ్రెస్ మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. మోదీ చేసిన ‘వీడియో గేమ్’ విమర్శలను ప్రస్తావిస్తూ.. భారత సైన్యం ఏమీ ఆయన సొంత ఆస్తి కాదని మండిపడ్డారు. యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైకులు వీడియో గేములలోనే జరిగాయని అంటే.. అది కాంగ్రెస్ పార్టీకి కాదు, ఆర్మీకి అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనిల్ అంబానీకి యూపీఏ హయాంలోనే రక్షణ పరికరాల ఆఫ్ సెట్ కాంట్రాక్టు వచ్చిందన్న అమిత్ షా ఆరోపణలను కూడా రాహుల్ ఖండించారు. ఈ విషయంలో ఏ దర్యాప్తు అయినా చేసుకోవచ్చని, తాను ఇంతవరకు ఏ తప్పూ చేయలేదని తెలుసు కాబట్టే దర్యాప్తు చేయాలని అన్నారు. న్యాయ్ పథకం చాలా శక్తిమంతమైనది, అసాధారణ పథకమని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోదీని కుప్పకూల్చిందని, ఇప్పుడు ఆయనదంతా డొల్లేనని, రాబోయే కొద్ది రోజుల్లో అది కూడా పడిపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తదుపరి ప్రధాని ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని, అది తన పని కాదని తెలిపారు. యువత, రైతులు, ఆర్థిక వ్యవస్థ అన్నీ చివరి అంచున ఉన్నాయని.. అన్ని రంగాలకూ తాము ఒక దిశానిర్దేశం చేయాల్సి ఉందని అన్నారు.
ఉద్యోగాలు, అవినీతి లాంటి అంశాల మీద చర్చకు రావాలని ప్రధానమంత్రి మోదీని రాహుల్ గాంధీ మరోసారి సవాలు చేశారు. తనకు కేవలం 10 నిమిషాల సమయం ఇవ్వాలన్నారు. చర్చకు ఎక్కడకు రమ్మన్నా వస్తానని, ఒక్క అనిల్ అంబానీ ఇంట్లో మాత్రం వద్దని ఎద్దేవా చేశారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థ రఫేల్ ఒప్పందంలో బాగా అనుచిత లబ్ధి పొందిందని ఆరోపించారు.